ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకల్‌ ట్రైన్‌లో.. టీచర్‌ను కత్తితో పొడిచి యువకుడు పరార్

national |  Suryaa Desk  | Published : Sun, Jan 25, 2026, 08:41 PM

చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి హత్యలకు తెగబడుతున్నారు. ఈ మధ్య కాలంలో యువతలో నేర స్వభావం కూడా పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ముంబైలో ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. ట్రైన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆగగానే.. అందరి కళ్ల ముందే తోటి ప్రయాణికుడిని కత్తితో పొడిచి పరుగులు తీశాడు. ఈ దాడిలో ఓ కళాశాల ప్రొఫెసర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టారు.


ఏం జరిగిందంటే?


ముంబైలో ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే ఆపసోపాలు పడాల్సిందే. అందులోనూ ఆఫీసుకు, స్కూళ్లు, కాలేజీకి వెళ్లేవారు లోకల్ రైళ్లలో సాహసాలు చేస్తుంటారు. లోకల్ రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. స్టేషన్‌లో రైలు ఆగాక ఎక్కాలన్న, దిగాలన్నా సాహసం చేయాలి. ఈ క్రమంలోనే తాజా హత్య జరిగింది. విలే పార్లేలోని ఒక ప్రముఖ కళాశాలలో అలోక్ సింగ్ (33) అనే వ్యక్తి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం (జనవరి 25) ఉదయం అతడు.. కాలేజ్‌కు వెళ్లడానికి లోకల్ రైలు ఎక్కాడు. అదే రైలులో ఓంకార్ ఏక్‌నాథ్ షిండే (27) అనే వ్యక్తి కూడా ఎక్కాడు.


లోకల్ రైలు మలాడ్ స్టేషన్‌కు సమీపిస్తున్న క్రమంలో కిందకు దిగే విషయంలో ఇద్దరి మధ్య చిన్న వాదన మొదలైంది. అనతంరం ఇద్దరు వాగ్వాదం చేసుకున్నారు. అలా గొడవ పెద్దదైంది. అయితే రైలు ప్లాట్‌ఫామ్‌‌పై ఆగిన వెంటనే.. కిందకు దిగిన ఏక్‌నాథ్ షిండే విచక్షణ కోల్పోయి తన బ్యాగ్‌లోని కత్తిని బయటకు తీసి అలోక్ సింగ్ పొత్తికడుపులో పలుమార్లు పొడిచాడు. దీంతో సింగ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోవడం చూసి షిండే పరుగులు తీశాడు. సింగ్‌ను హుటాహుటిన బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు చనిపోయాడని చెప్పారు.


ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. దాడి జరిగిన కొద్దిసేపటికే నిందితుడుని ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. రైలు దిగే విషయంలో జరిగిన వాదన కారణంగానే ఈ హత్య జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ.. ఇద్దరి మధ్య పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కాగా, అలోక్ సింగ్‌ తూర్పు మలద్‌ ప్రాంతంలో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. నార్సీ మోంజీ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. అయితే సింగ్ చాలా మృదు స్వభావి అని, ఈ ఘటన అందరినీ షాక్‌కు గురి చేసిందని అతడి సహోపాధ్యాయులు తెలిపారు. మరోవైపు, నిందితుడు ఓంకార్ ఏక్‌నాథ్ షిండే ముంబై శివారుల్లో దినసరి కూలీగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 12 గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa