ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వే.. ఆఫ్‌లైన్‌లోనూ అవకాశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 04:24 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వే ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వేలో కుటుంబసభ్యుల సమాచారం సేకరించారు. అయితే ఈ సర్వే మ్యాపింగ్ సమయంలో తప్పులు దొర్లినట్లు ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో అర్హత ఉన్నప్పటికీ చాలా మందికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి అందడం లేదని చెప్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభించారు.


డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే ప్రారంభమైంది. వివిధ కారణాలతో కొన్నిచోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. 30 రోజుల పాటు సర్వే చేపట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ లెక్కన జనవరి 12వ తేదీ వరకూ ఏకీకృత కుటుంబ సర్వేను చేపట్టాలని అధికారులు తొలుత నిర్ణయం తీసుకున్నారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఏకీకృత కుటుంబ సర్వే ఆలస్యమవుతోంది.


ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకీకృత కుటుంబ సర్వేను ఫిబ్రవరి 10వ తేదీ వరకూ పొడిగించింది. ఈలోపు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వివరాలను సర్వేలో నమోదు చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికీ సర్వేను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఏకీకృత సర్వేను ఆన్‌లైన్ విధానంలో చేపడుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా ఉండటం లేదు. దీంతో ఏకీకృత కుటుంబ సర్వే ముందుకు సాగడం లేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చెప్తు్న్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో సుమారు 20 రకాల అంశాల గురించి సమాచారం సేకరించాల్సి ఉంటుంది.


ఆధారాలను ధ్రువీకరించి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే.. అప్పటి వరకూ నమోదు చేసిన మొత్తం సమాచారం వెళ్లిపోతోంది. దీంతో అదేదో పాత సామెతలాగా తిరిగి మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో కుటుంబానికి గంటకు పైగా సమయం పడుతోందని సచివాలయ సిబ్బంది చెప్తు్న్నారు.


ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు ఈ సమస్యను ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. సర్వర్ సమస్య, సిగ్నలింగ్ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఏకీకృత కుటుంబ సర్వేను ఆఫ్‌లైన్‌లో చేపట్టే అవకాశం కల్పించాలని.. గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టరేట్‌ను సచివాలయ ఉద్యోగులు కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జనవరి నెలాఖర నుంచి ఏకీకృత కుటుంబ సర్వేను ఆఫ్‌లైన్‌లో నిర్వహించే అవకాశం ఇస్తామని సమాచారం వచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa