దేశంలో అత్యంత ప్రమాదకర వ్యాది నిపా వైరస్ వ్యాప్తిపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్లో భాగమైన ఇండియా కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా కీలక విషయాలు వెల్లడించారు. కేరళ, పశ్చిమ బెంగాల్లో ఈ వైరస్ స్థానికంగా వ్యాప్తిలోకి వెళ్లిందని అరోరా హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లో మొదటగా ఐదుగురు ఆరోగ్య కార్యకర్తలలో వైరస్ను గుర్తించామని, మరో 100 నుంచి 200 మందికి సోకి ఉండొచ్చనే అనుమానంతో స్క్రీనింగ్ చేపట్టామని ఆయన చెప్పారు. డాక్టర్ అరోరా ప్రకారం.. నిపా వైరస్ అనేది జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే (జూనోటిక్) వ్యాధి. దీని మరణాల రేటు 40% నుంచి 75% వరకు ఉంటుంది. ఇది ప్రమాదకర అంటువ్యాధి అని, సోకిన వారిలో మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్) లేదా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని ఆయన వివరించారు.
‘నిపా వైరస్ అనేది జూనోటిక్ వ్యాధి... కేరళ, పశ్చిమ్ బెంగాల్ రెండింటిలోనూ అడపాదడపా ఈ వ్యాప్తి సంభవించింది. అయితే, బంగ్లాదేశ్లో కూడా నిపా వైరస్ స్థానికంగా వ్యాప్తి చెందుతోంది.. బెంగాల్లో ఓ వ్యక్తి తెలియని వ్యాధితో చనిపోయిన తర్వాత ఐదుగురు ఆరోగ్య కార్యకర్తలలో మొదటగా గుర్తించారు... ఇప్పుడు, వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న మరో 100 నుంచి 200 మందిపై స్క్రీనింగ్ జరుగుతోంది... నిపా వైరస్ తీవ్ర అంటువ్యాధి, ప్రాణాంతకమైనది... సోకిన వ్యక్తికి ఎన్సెఫాలిటిస్ లక్షణాలు లేదా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి వస్తుంది.. మరణాల రేటు 40 నుంచి 75% వరకు ఉంటుంది, ఇది చాలా ఎక్కువ’ అని డాక్టర్ అరోరా తెలిపారు.
ఈ వైరస్కు ప్రస్తుతం ఎటువంటి టీకా అందుబాటులో లేదని డాక్టర్ అరోరా తెలిపారు. ‘ప్రస్తుతం ఈ వైరస్కు ఎటువంటి టీకా అందుబాటులో లేదు,.. నిఫా వైరస్ సంక్రమణ నిర్ధారణ అయిన వెంటనే మోనోక్లోనల్ యాంటీబాడీలను ఇవ్వాలి’" అని ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీల సరఫరా చాలా పరిమితంగా ఉందని, అయితే భారత్ వాటి లభ్యతను నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన కార్యక్రమంగా చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.
‘ప్రపంచవ్యాప్తంగా మోనోక్లోనల్ యాంటీబాడీల సరఫరా చాలా పరిమితంగా ఉంది.. భారతదేశం వాటి లభ్యతను నిర్ధారించడానికి దీనిని ఒక ముఖ్యమైన కార్యక్రమంగా చేపట్టింది. త్వరలోనే, దేశంలో తగినంత మోనోక్లోనల్ యాంటీబాడీలు అందుబాటులోకి వస్తాయని నేను ఆశిస్తున్నాను. అయితే, గబ్బిలాలు ఉన్న ప్రాంతాలలో మనుషులు, జంతువుల మధ్య సంబంధాలను కనిష్టం చేయడం లేదా నివారించడం ద్వారా వ్యాధిని నివారణలో అప్రమత్తంగా ఉండాలి’ అని డాక్టర్ అరోరా సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa