ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 28, 2026, 07:15 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి పిఠాపురానికి శుభవార్త తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఢిల్లీ పర్యటన సందర్భంగా సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై కేంద్రమంత్రులతో పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం పవన్ కళ్యాణ్ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. కాకినాడ, పిఠాపురం మధ్య రైల్వే అనుసంధానం పెంచాలని విజ్ఞప్తి చేశారు.


పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటుగా రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై చర్చించారు. సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని పవన్ కళ్యాణ్ వివరించారు.


పిఠాపురం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద మోడల్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి కొలువైన క్షేత్రాలు పిఠాపురంలో ఉన్నందున దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వీటితోపాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి పవన్ కళ్యాణ్ చర్చించారు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు రాజకీయ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.


పిఠాపురం నియోజకవర్గంలోని సామర్లకోట - ఉప్పాడ రహదారిలో రోడ్డు ఓవర్ బ్రిడ్డి నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ కారణంగా వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాము గెలిచి అధికారంలోకి వస్తే ఆర్వోబీ నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ మేరకు గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్.. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు.


దీంతో పిఠాపురం నియోజకవర్గంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం పాలనాపరమైన అనుమతి ఇవ్వటంతో పాటుగా రూ. 59.70 కోట్లు మంజూరు చేసింది. తాజాగా ఈ ప్రాజెక్టును సేతు బంధన్ పథకం కింద కాకుండా గతిశక్తి పథకం కిందకు చేర్చాలని పవన్ కళ్యాణ్ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa