బారామతి ఎయిర్పోర్టులో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గాలిలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు పైలట్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉదయం 8:36 గంటల సమయంలో మొదటిసారి రన్వేపై దిగేందుకు ప్రయత్నించినప్పటికీ, అనుకూలించకపోవడంతో విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఫ్లైట్రాడార్ గణాంకాల ప్రకారం, ఈ క్రమంలోనే విమానం నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.
రెండోసారి విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు పైలట్ తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం. అయితే, ఉదయం 8:43 గంటల ప్రాంతంలో విమానం నుంచి చివరి సిగ్నల్ అందినట్లు ఫ్లైట్రాడార్ డేటా స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత క్షణాల్లోనే విమానం కంట్రోల్ తప్పి ప్రమాదానికి గురైంది. అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేయాలని పైలట్ చేసిన సాహసోపేత ప్రయత్నం విఫలమవ్వడం అక్కడి వారిని కలచివేసింది.
ఈ విమానశ్రయంలో మౌలిక సదుపాయాల కొరత కూడా ప్రమాద తీవ్రతకు ఒక కారణమని భావిస్తున్నారు. ఇక్కడ కేవలం ఒకే ఒక రన్వే అందుబాటులో ఉండటం, అత్యవసర సమయాల్లో పైలట్కు ప్రత్యామ్నాయం లేకుండా చేసింది. దీనికి తోడు, విమానాశ్రయంలో కనీస 'ఆటోమేటిక్ వెదర్ రిపోర్టింగ్' వ్యవస్థ లేకపోవడం గమనార్హం. వాతావరణ పరిస్థితులపై ముందస్తు స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల ల్యాండింగ్ సమయంలో పైలట్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రమాదంపై అధికారులు విచారణ చేపడుతున్నారు. సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ఘోరం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ప్రమాద సమయంలో విమాన గమనం మరియు సిగ్నల్స్ నిలిచిపోయిన తీరును బట్టి చూస్తే, పైలట్ చివరి నిమిషం వరకు విమానాన్ని కాపాడేందుకు పోరాడినట్లు స్పష్టమవుతోంది. ఈ ఘటన విమాన ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చకు దారితీసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa