భారత్ విషయంలో కెనడా రివర్స్ గేర్ వేసింది. ఇన్నాళ్లూ దౌత్య విభేదాలతో భారత్కు దూరంగా ఉన్న కెనడా.. గోవా వేదికగా జరుగుతున్న 'ఇండియా ఎనర్జీ వీక్ 2026'లో ఇరుదేశాల మధ్య ఇంధన బంధాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఈక్రమంలోనే కెనడా ఇంధన శాఖ మంత్రి టిమ్ హడ్గ్సన్, భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగానే కెనడా మంత్రి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్లలో ఒకటిగా భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు. ఇంధన రంగంలో కెనడా సూపర్ పవర్ కావాలంటే భారత్థో వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
"భారత్తో వ్యాపారం.. కెనడాకు అనివార్యం"
గోవా వేదికగా జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2026లో పాల్గొన్న కెనడా మంత్రి టిమ్ హడ్గ్సన్.. "ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్లలో భారత్ ఒకటి. ఒకవేళ కెనడా ఇంధన రంగంలో ‘సూపర్ పవర్’ కావాలని కోరుకుంటే.. అది భారత్తో వాణిజ్యం చేయకుండా సాధ్యం కాదు" అని తెలిపారు. ముఖ్యంగా అమెరికా నుంచి ఎదురవుతున్న వాణిజ్య సవాళ్ల నేపథ్యంలో.. కెనడా భారత్ వైపు తన వ్యూహాన్ని మార్చుకుంది.
ఇరు దేశాల మంత్రుల చర్చల్లో కేవలం ముడి చమురుకే పరిమితం కాకుండా భవిష్యత్ ఇంధన అవసరాలపై భారీ ఒప్పందాలు కూడా కుదిరాయి. కెనడా నుంచి భారత్కు ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరాను పెంచేందుకు టిమ్ హడ్గ్సన్ మొగ్గు చూపారు. ప్రతిగా భారత్ నుంచి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు కెనడాకు వెళ్లనున్నాయి. అలాగే హైడ్రోజన్ ఇంధనం, బయో ఇంధనాలు, బ్యాటరీ స్టోరేజ్, ఇంధన రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై కలిసి పని చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్లో భారత్కు కెనడా సహకారం అందనుంది.
2050 నాటికి భారతే రారాజు!
ఈ భేటీ అనంతరం హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి పథాన్ని వివరించారు. "2050 నాటికి ప్రపంచవ్యాప్త ఇంధన డిమాండ్లో భారత్ వాటా 30 నుంచి 35 శాతానికి పెరుగుతుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన మార్కెట్గా భారత్ అవతరించబోతోంది" అని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ డిమాండ్ను అందుకోవడంలో కెనడా వంటి దేశాలతో భాగస్వామ్యం భారత్కు ఇంధన భద్రతను కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ‘మంత్రిత్వ స్థాయి ఇంధన చర్చలు’ పునఃప్రారంభం కావడం ఇరు దేశాల దౌత్య నీతిలో వచ్చిన పెద్ద మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందాల పరంపరను ముందుకు తీసుకెళ్లేందుకు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ త్వరలోనే భారత్ లో పర్యటించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa