ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ ఛైర్మన్ కీలక ప్రకటన.. తెరపైకి కొత్త టెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 30, 2026, 07:17 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఛార్జ్‌షీట్ ఆధారంగా చేసుకుని అధికార కూటమి, వైసీపీ పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ క్రమంలో సిట్ నివేదికపై తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో అరాచకాలు చేశారంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. సిట్ క్లీన్‌‍చిట్ ఇచ్చిందంటూ వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు చెబుతున్న వారికి బుద్థుండాలంటూ టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా వైసీపీ నేతలు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో హిందువులపై దాడి జరిగిందని ఆక్షేపించారు.


టీటీడీ నిబంధనలు మార్చారని.. సామర్థ్యం లేని డైరీలకు నెయ్యి సరఫరాను అప్పగించారంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. వైసీపీ హయాంలో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారన్న టీటీడీ ఛైర్మన్.. జంతుకొవ్వు లేదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రసాయనాలు వాడిన నెయ్యి సరఫరా చేశారని సిట్ ఛార్జ్‌షీట్లో స్పష్టంగా పేర్కొన్నారని.. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను నెయ్యి తయారీ కోసం వాడారని బీఆర్ నాయుడు ఆరోపించారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలను తయారు చేశారని వెల్లడించారు.


నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చిందన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. సిట్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు. వైసీపీ నేతలు కమీషన్ల కోసం కక్కుర్తిపడి మహాపాపం చేశారని బీఆర్ నాయుడు ఆరోపించారు. ఏ నిబంధనల ప్రకారం భోలేబాబా డెయిరీకి టెండర్ ఇచ్చారన్న టీటీడీ ఛైర్మన్.. వైవీ సుబ్బారెడ్డికి తెలియకుండానే ఆయన పీఏ చిన్నప్పన్న ఇదంతా చేస్తారా అని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి బ్యాంక్ ఖాతాల వివరాలను సిట్‌కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో టీటీడీలో ప్రతి విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘించారని బీఆర్ నాయుడు ఆరోపించారు. కల్తీ నెయ్యి కేసులో వెనుక ఉన్న వారి పేర్లను సిట్ వెలికితీయాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. అలాగే వైసీపీ హయాంలో వంద శాతం నెయ్యి కల్తీ అయ్యిందని.. ఈ విషయంపై మైక్రో డీఎన్‌ఏ టెస్టు చేయాలని కోర్టును కోరతామని వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa