పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరియు కేంద్ర ఎన్నికల సంఘం (EC) మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి ముదిరాయి. తాజా పరిణామాల్లో, అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఈసీ ప్రకటించిన అబ్జర్వర్ల జాబితాను సీఎం మమతా బెనర్జీ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈసీ ప్రతిపాదించిన 15 మంది అధికారులలో ఏకంగా 9 మందిని మార్చాలని కోరుతూ బెంగాల్ ప్రభుత్వం ఘాటుగా లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విధులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 25 మందితో కూడిన అబ్జర్వర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ హోం సెక్రటరీ జగదీష్ ప్రసాద్తో పాటు హౌరా, అసన్సోల్ పోలీస్ కమిషనర్లు మరియు ఇతర కీలక ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ నియామకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బెంగాల్ ప్రభుత్వం, వారిని పక్కన పెట్టి తాము సూచించిన కొత్త పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాల సంప్రదింపులతోనే ఇలాంటి నియామకాలు జరుగుతుంటాయి. అయితే, అబ్జర్వర్ల ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడం వల్లే తాము స్వయంగా ఈ జాబితాను ప్రకటించాల్సి వచ్చిందని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. కానీ, ఈ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, తమ అధికారులను ఎన్నికల విధులకు కేటాయించడం పాలనాపరంగా ఇబ్బందులకు దారితీస్తుందని మమతా సర్కార్ వాదిస్తోంది.
ఈ 9 మంది అధికారుల మార్పు కోరుతూ పంపిన ప్రతిపాదనపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ పనులు వేగవంతం అవుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈసీ మధ్య జరుగుతున్న ఈ పోరు ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చ మొదలైంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఈ 'అబ్జర్వర్ల రగడ' చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa