ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌పై బలూచ్ ఆర్మీ యుద్ధం.. 10 మంది పాక్ సైన్యం, 37 మంది తిరుగుబాటుదారులు మృతి

national |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 08:15 PM

గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ ప్రభుత్వంపై భీకర దాడులకు దిగుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ).. మరోసారి యుద్ధానికి దిగింది. బలోచిస్తాన్‌లో వేర్పాటువాద గ్రూపు అయిన ఈ బీఎల్ఏ జరిపిన భారీ సమన్వయ దాడుల్లో కనీసం 10 మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బంది దుర్మరణం చెందారు. అయితే పాక్ సైన్యంతో జరిగిన దాడుల్లో 37 మంది బలోచ్ తిరుగుబాటుదారులు కూడా మరణించారు. బలోచిస్తాన్‌లోని ఐదు జిల్లాల్లో భారీగా తుపాకులు, ఆత్మహుతి బాంబులతో ఈ దాడులు జరిగినట్లు పాకిస్తాన్ భద్రతా అధికారులు ధృవీకరించారు.


బలోచిస్తాన్ ప్రావిన్షియల్ రాజధాని అయిన క్వెట్టాతో పాటు పస్ని, మస్తుంగ్, నుష్కీ, గ్వాదర్ జిల్లాల్లోని 12 కంటే ఎక్కువ ప్రాంతాల్లో బలోచ్ వేర్పాటు వాదులు ఒకేసారి దాడులు చేశారు. ఈ ఘర్షణల్లో 37 మంది వేర్పాటువాదులను పాక్ భద్రతా దళాలు హతమార్చగా.. 10 మంది భద్రతా సిబ్బంది కూడా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కేవలం క్వెట్టా నగరంలోనే నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఈ భీకర దాడులకు బాధ్యులం తామేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలు, పోలీసులు, పౌర పరిపాలన అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు వారు తెలిపారు.


ఆపరేషన్ హెరోఫ్ 


తమ మాతృభూమి బలూచిస్తాన్‌ను రక్షించుకునేందుకు ఆపరేషన్ హెరోఫ్‌లో భాగంగా రెండో దశను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా బీఎల్ఏ తిరుగుబాటు దారులు ప్రకటించారు. అయితే పాకిస్తాన్ భద్రతా దళాలు వేగంగా స్పందించడం వల్ల వేర్పాటువాదుల ప్లాన్ పూర్తిగా అమలు కాలేదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ దాడులు సమన్వయంతోనే చేసినప్పటికీ.. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వారు ఎక్కువ నష్టాన్ని కలిగించలేకపోయారని పేర్కొన్నారు. పాక్ భద్రతా దళాల చేతిలో వారు భారీగా చనిపోయినట్లు వెల్లడించారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో ప్రస్తుతం భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన అధికారులు.. ఎమర్జెన్సీ టీమ్స్‌ను రంగంలోకి దించారు.


బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో ఖనిజ సంపద పుష్కలంగా ఉండటంతో గత కొన్ని దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమం తీవ్రంగా నడుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ బలోచిస్తాన్ ప్రాంతంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులు తరచుగా పాకిస్తాన్ భద్రతా దళాలను, విదేశీయులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa