ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు, అక్రమ కేసులు నమోదు చేయడం పెరిగిపోయిందని ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపిన ఎంపీలు, రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడిపోయాయని ఆరోపించారు. ఇళ్లు, వాహనాలు తగులబెట్టడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగ పాలనకు బదులు సొంతంగా రూపొందించుకున్న “రెడ్ బుక్ రాజ్యాంగం”ను అమలు చేస్తున్నట్లుగా పరిస్థితులు మారాయని విమర్శించారు.మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని ఇళ్లపై జరిగిన దాడులను ప్రస్తావించిన ఎంపీలు, ఇవి కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు స్పష్టమైన ఉదాహరణలని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఎంపీలు మండిపడ్డారు. శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని, కేంద్ర హోంమంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను పునరుద్ధరించాల్సిన బాధ్యత తీసుకోవాలని వైయస్ఆర్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa