గత కొన్ని దశాబ్దాలుగా మానవ మేధస్సు నిరంతరం వృద్ధి చెందుతూ వచ్చింది, కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ రివర్స్ అవుతోందని ప్రముఖ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ హార్వత్ తన తాజా పరిశోధనలో హెచ్చరించారు. చరిత్రలో మునుపటి తరం కంటే తక్కువ ఐక్యూ (IQ) స్కోర్లను నమోదు చేసిన మొదటి తరంగా 'జెన్-జీ' (Gen Z) నిలుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 'ఫ్లిన్ ఎఫెక్ట్' ద్వారా తెలివితేటలు పెరుగుతూ వచ్చిన క్రమం ఆగిపోయి, ఇప్పుడు తిరోగమన దిశలో ప్రయాణించడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురి చేస్తోంది.
ఈ మేధోపరమైన వెనుకబాటుకు విద్యావ్యవస్థలో మితిమీరిన టెక్నాలజీ వినియోగమే ప్రధాన కారణమని డాక్టర్ హార్వత్ విశ్లేషించారు. తరగతి గదుల్లో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల వాడకం వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, వారి మెదడు తీవ్రమైన ఆలోచనలకు దూరమవుతోంది. పాఠ్యపుస్తకాల కంటే డిజిటల్ స్క్రీన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల లోతైన విశ్లేషణా సామర్థ్యం తగ్గిపోతోంది. సాంకేతికత నేర్చుకోవడానికి సాయపడాల్సింది పోయి, నేర్చుకోవాలనే తపనను మొద్దుబారుస్తోంది.
పుస్తక పఠనం తగ్గిపోవడం మరియు ఏఐ (AI) సాధనాలపై అతిగా ఆధారపడటం వల్ల యువతలో జ్ఞాపకశక్తి మందగిస్తోంది. ఏదైనా చిన్న సందేహం వచ్చినా సొంతంగా ఆలోచించకుండా కృత్రిమ మేధ ఇచ్చే సమాధానాల కోసం ఎదురుచూడటం వల్ల మెదడుకు సరైన శిక్షణ అందడం లేదు. ఫలితంగా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే శక్తి క్రమంగా క్షీణిస్తోంది. అక్షరజ్ఞానం పెరిగినట్లు కనిపిస్తున్నా, సమాచారాన్ని విశ్లేషించి జ్ఞానంగా మార్చుకునే ప్రక్రియలో యువత వెనుకబడిపోతున్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన ఈ సవాళ్లను అధిగమించాలంటే విద్యా బోధనలో మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. స్మార్ట్ఫోన్ల వాడకాన్ని నియంత్రించి, మళ్ళీ పుస్తకాలతో అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారానే మేధోశక్తిని కాపాడుకోగలమని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీని కేవలం ఒక సాధనంగా మాత్రమే చూడాలని, అది మెదడుకు ప్రత్యామ్నాయం కాకూడదని హార్వత్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాబోయే తరాలు సొంతంగా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa