ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షుగర్ వల్ల మూత్రపిండాలు ఎఫెక్ట్ అయితే కనిపించే లక్షణాలు ఇవే

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 11:32 PM

డయాబెటిస్‌.. ఈ రోజుల్లో చాలా మందిని బాధపడుతున్న వ్యాధి. ఇది జీవనశైలికి సంబంధించింది. అంటే మనం జీవనశైలిలో మార్పులు, తిండి అలవాట్లు, శారీరక శ్రమకు దూరంగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి. ఒక్కసారి షుగర్ వచ్చిదంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి శాశ్వత చికిత్స లేదు. ఇది మన జీవనశైలిని పూర్తిగా మార్చే వ్యాధి. దీనిని సకాలంలో నియంత్రించకపోతే ఇది ఇతర వ్యాధుల ప్రమాదాన్ని వేగంగా పెంచుతుంది.


డయాబెటిస్ శరీరంలోని వివిధ భాగాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగితే కళ్లు, కిడ్నీలు, నరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. డయాబెటిస్ మూత్రపిండాల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. షుగర్ రోగుల్లో దాదాపు మూడింట ఒక వంతు మందికి మూత్రపిండాల వ్యాధి వస్తుంది. దీనిని డయాబెటిక్ నెఫ్రోపతి అని పిలుస్తారు. డయాబెటిస్ ఉన్నవారిలో దాదాపు మూడింట ఒక వంతు మందికి మూత్రపిండాలకు సంబంధిన వ్యాధి వస్తుంది.


​క్లీవ్ ల్యాండ్ క్లీనిక్ ప్రకారం టైప్ 1 డయాబెటిస్ సాధారణంగా మూత్రపిండాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. టైప్ - 2 డయాబెటిస్‌లో కూడా కిడ్నీలకు నష్టం కలుగుతుంది. అయితే, లక్షణాలు కనపించడానికి చాలా సమయం పడుతుంది. ఇది డయాబెటిస్ ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది. సకాలంలో తగిన చర్యలు తీసుకుంటే మూత్రపిండాలను రక్షించవచ్చు. డయాబెటిస్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయితే కనిపించే లక్షణాలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి విషయాల్ని డాక్టర్ సత్యనారాయణ గారె వివరించారు. ఆయనతో పాటు క్లీవ్ ల్యాండ్ క్లీనిక్ నివేదిక నుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


డయాబెటిస్ మూత్రపిండాల్ని ఎలా దెబ్బతీస్తుంది?


​రక్తంలో అధిక షుగర్ లెవల్స్ లేదా డయాబెటిస్ మూత్రపిండాల రక్త నాళాల్ని దెబ్బతీస్తుంది. ఈ నాళాలు బలహీనమైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు అవి సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. ఇది మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా గణనీయంగా పెంచుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం కలయిక మూత్రపిండాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని డాక్టర్ సత్యనారాయణ చెబుతున్నారు.


డయాబెటిక్ కిడ్నీ వ్యాధికి ప్రమాద కారకాలు


ఊబకాయం


ధూమపానం


అధిక రక్తపోటు


ఎక్కువగా ఉప్పు ఉండే ఆహారం తీసుకోవడం


గుండె జబ్బులు ఉండటం


కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉన్న చరిత్ర


అనియంత్రిత రక్తపోటు


డయాబెటిస్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయితే కనిపించే లక్షణాలు


మూత్రంలో ఎక్కువ నురుగ: నురుగుతో కూడిన లేదా బుడగలతో కూడిన మూత్రం ప్రోటీన్ లీకేజీని సూచిస్తుందని డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయడం, ముదురు లేదా టీ రంగులో మూత్రం లేదా మూత్రం తగ్గడం వంటి లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు.


అలసట,బలహీనత: నిరంతర అలసట, బలహీనత లేదా నడుము దిగువ భాగంలో భారంగా అనిపించడం కూడా కిడ్నీలపై పెరిగిన ఒత్తిడికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కొనసాగితే కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యాయని అర్థం చేసుకోండి.


పాదాలు, కళ్ళ చుట్టూ వాపు: నిపుణుల ప్రకారం, ద్రవ నిలుపుదల ఇంకో హెచ్చరిక సంకేతం. మూత్రపిండాలు అదనపు ద్రవాన్ని తొలగించలేనప్పుడు ఇది శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. పాదాల్లో లేదా కళ్ళ చుట్టూ తేలికపాటి వాపు మూత్రపిండాల నష్టానికి సంకేతం కావచ్చు.


ఆకలి లేకపోవడం: డయాబెటిస్ ఉన్న రోగి అకస్మాత్తుగా ఆకలిని కోల్పోతే లేదా వారి ఆకలిలో మార్పులను గమనించినట్లయితే.. అది డయాబెటిక్ నెఫ్రోపతి వ్యాధికి సంకేతం కావచ్చు. రక్తంలో మలినాలు పేరుకుపోయినప్పుడు వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి.


అధిక రక్తపోటు: బీపీలో స్వల్ప పెరుగుదల కూడా తీవ్రంగా పరిగణించాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మూత్రపిండాలు రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.


దురదగా ఉండటం: రక్తంలో మలినాలు పెరగడం వల్ల చర్మంపై తీవ్రమైన, నిరంతర దురద వస్తుంది.


వాంతులు, వికారం: శరీరంలో టాక్సిన్లు పేరుకుపోవడం వల్ల వికారం, తరచుగా వాంతులు అవుతుంటాయి.


షుగర్ కిడ్నీలను దెబ్బతీస్తుందో లేదో ఎలా తెలుసుకోవాలి?


క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. యూరిన్ అల్బుమిన్-టు-క్రియేటినిన్ నిష్పత్తి (UACR) మూత్రపిండాల నష్టానికి తొలి సంకేతం కావచ్చు. eGFR రక్త పరీక్ష మూత్రపిండాలు వ్యర్థ ఉత్పత్తుల్ని ఎంత బాగా ఫిల్టర్ చేస్తున్నాయో సూచిస్తుంది.


ప్రతి డయాబెటిక్ రోగి కనీసం సంవత్సరానికి ఒకసారి రెండు పరీక్షలు చేయించుకోవాలి. అధిక రక్తపోటు మూత్రపిండ వ్యాధికి మాత్రమే కాకుండా దానిని వేగంగా తీవ్రతరం చేస్తుంది. అందుకే క్రమం తప్పకుండా రక్తపోటు పర్యవేక్షణ అవసరం.


ముందుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?


డాక్టర్ ప్రకారం, మూత్రపిండాల పనితీరు క్షీణతకు నిర్ణీత కాలపరిమితి లేదు. చాలా మంది డయాబెటిక్ రోగులకు, ఈ ప్రక్రియ ఏళ్లుగా నెమ్మదిగా కొనసాగుతుంది. కానీ స్పష్టమైన లక్షణాలు కనిపించిన తర్వాత, పరిస్థితి వేగంగా క్షీణిస్తుంది. ముందుగా గుర్తించడం వల్ల రక్తంలో చక్కెర, రక్తపోటు నియంత్రణపై దృష్టి పెట్టవచ్చు. అంతేకాకుండా సరైన మెడిసిన్‌ను డాక్టర్లు సూచిస్తారు. సకాలంలో చికిత్స అందించడం వల్ల కిడ్నీల వైఫల్యం అయ్యే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa