రాష్ట్ర పాలన, అభివృద్ధి లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ సుదీర్ఘ సమీక్ష జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానుండగా, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో పాల్గొంటారు.ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా 'స్వర్ణాంధ్ర విజన్ 2047'లో భాగంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు, పాలనలో పారదర్శకత, సామర్థ్యం పెంచేందుకు రూపొందించిన పది సూత్రాల అమలు పురోగతిపై చర్చించనున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటును పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.ఆదాయాన్ని ఆర్జించే శాఖల పనితీరు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో సమీక్ష జరగనుంది. రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సీఎం విశ్లేషించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్లో భాగంగా అవేర్, డేటా లేక్ వంటి వ్యవస్థల వినియోగం, పాలనలో కృత్రిమ మేధ టూల్స్, ఇతర ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.వీటితో పాటు రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం, 'వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్' విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్ర ర్యాంకును మెరుగుపరచడం, శాంతిభద్రతల పరిస్థితిపై కూడా సమీక్షించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలు సాధించాల్సిన లక్ష్యాలు, చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా స్థాయి అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa