Digital Attendance in AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇక నుంచి అసెంబ్లీలో హాజరు పుస్తకం ఉండదని, ఎమ్మెల్యేల హాజరు పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే నమోదు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీకి హాజరైన ప్రతి ఎమ్మెల్యే డిజిటల్ అటెండెన్స్ విధానంలో హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఇకపై రిజిస్టర్లో సంతకాలు చేసే పాత విధానానికి ముగింపు పలికినట్టయింది. దీనికి సంబంధించిన వివరాలతో ఎమ్మెల్యేలకు బులిటెన్ విడుదల చేసినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు.ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే హాజరు పట్టికలో సంతకం చేస్తున్నారనే విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాలులోకి ప్రవేశించకుండానే హాజరు నమోదు చేసి వెళ్లిపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ అటెండెన్స్ విధానంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇక రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎల్లుండి నుంచి సభకు హాజరు అంశంపై స్పష్టత లేకపోయినా, రేపు వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి హాజరవుతారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇప్పటికే వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa