ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకంపనలు రేపుతోన్న ఆంథ్రోపిక్ సంస్థ ఏఐ టూల్,,,,సేఫ్టీ రిసెర్చ్ విభాగం చీఫ్‌ శర్మ రాజీనామా

international |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 10:17 PM

ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆంథ్రోపిక్ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. అది రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ ఐటీ రంగానికి సవాల్‌గా మారుతుందనే ఆందోళనల నడుమ ఆ సంస్థకు చెందిన కీలక ఉద్యోగి రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆంత్రోపిక్‌ సేఫ్‌గార్డ్ రిసెర్చ్ టీమ్‌‌ హెడ్‌గా వ్యవహరిస్తున్న మృణాంక్ శర్మ రాజీనామా చేసినట్టు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం తీవ్రమైన ప్రమాదంలో ఉందని శర్మ హెచ్చరించారు. అ ముప్పు ఏఐ, జీవాయుధాల వల్లే కాదు.. పరస్పరం అనుసంధానమైన అనేక సంక్షోభాలు కూడా పెను ముప్పుగా మారాయని ఆయన అన్నారు.


 ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే మన అవగాహన ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయిలో పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆంథ్రోపిక్‌ను వీడాలని నిర్ణయించుకున్నానని, తాను ఈ సంస్థలో చేరినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిగా సాధించానని మృణాంక్ అన్నారు. పీహెచ్‌డీ తర్వాత ఏఐ సేఫ్టీ రంగంలో పని చేయాలనే లక్ష్యంతో శాన్‌ఫ్రాన్సిస్కోకు రెండేళ్ల కిందట వచ్చానని, ఏఐ రంగంలో తాను చేసిన కృషిపై చాలా సంతృప్తిగా ఉన్నానని ఆయన తెలిపారు. అయితే, శర్మ తనకున్న ప్రత్యేకతలు ఏంటని చెప్పకపోయినా.. నిరంతర ఒత్తిడి అంటే తనకు అత్యంత ముఖ్యమైన విలువలను పక్కన పెట్టడం అని పేర్కొన్నారు.


శర్మ తన చివరి ప్రాజెక్టులలో ఒకటి ‘AI మనల్ని ఎలా తక్కువ చేస్తుంది లేదా మన మానవత్వాన్ని ఎలా వక్రీకరిస్తుందనేది అర్థం చేసుకోవడం గురించి’ అని కూడా వివరించారు. ఇకపై తాను కవిత్వంపై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు శర్మ సూచనాప్రాయంగా వెల్లడించారు. కాగా, రిల్కే, విలియం స్టాఫోర్డ్ వంటి కవులను ప్రస్తావించిన శర్మ నిగూఢమైన పోస్ట్‌ను సాంకేతిక నిపుణులు, వ్యాఖ్యాతలు ఖండించారు. ఏఐ భద్రతపై రాజీ పడటమే రాజీనామాకు ఆయనను ప్రేరేపించి ఉండవచ్చని ఎత్తిచూపారు.


కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టికల్ మెషిన్ లెర్నింగ్‌లో మృణాక్‌ శర్మ పీహెచ్‌డీ పూర్తిచేశారు. అనంతరం ఆంథ్రోపిక్‌ సంస్థలో ఉద్యోగిగా చేరారు. ఏఐ ఆధారిత జీవాయుధ ఉగ్రవాదం నుంచి వచ్చే ముప్పు తగ్గించేందుకు గార్డ్‌రెయిల్స్‌ను అభివృద్ధి చేశారు. అలాగే, ఏఐ చాట్‌బాట్‌లను అధికంగా ఉపయోగించడం వల్లే వచ్చే ముప్పుపై కూడా అధ్యయనం చేశారు. కాగా, ఆంథ్రోపిక్‌ ఏఐ సేఫ్టీ టీమ్ నుంచి బయటకు వెళ్లిపోయిన వారిలో శర్మే మొదటి వ్యక్తి కాదు. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెట్ విభాగంలో పనిచేసి హర్ష్ మెహతా, ఏఐ సైంటిస్ట్ బెహనమ్ నేషాబూర్‌‌లు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa