పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం సమర్థనీయం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏటా 3,500 టీఎంసీల గోదావరి వరద నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని, అందులోంచి 200 టీఎంసీల నీటిని నల్లమలసాగర్కు తరలించాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఈ ప్రాజెక్టుకు అడ్డుపడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మూడేళ్లలో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తామని, పోలవరాన్ని వంశధారతో అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. గడిచిన 20 నెలల్లో తమ సంకీర్ణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో గణనీయమైన ప్రగతి సాధించిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని వివరించారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఎదురైన ఇబ్బందులను అధిగమించిన తీరును, అభివృద్ధిని అడ్డుకోవడానికి జరుగుతున్న కుట్రలను సభలో ప్రస్తావించారు.రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందుందని, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు విశాఖకు వస్తున్నాయని చెప్పారు. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, రామాయపట్నం వద్ద రూ.70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని కచ్చితంగా నెరవేరుస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.ప్రజారోగ్య సేవలను మెరుగుపరిచేందుకు 'సంజీవని' ప్రాజెక్టును తీసుకొస్తున్నామని ఇందులో భాగంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తామని తెలిపారు. ఈ నెల 16న బిల్ గేట్స్ రాష్ట్ర పర్యటనకు రానున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa