బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) మళ్లీ అధికార పగ్గాలు చేపడుతోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 17వ తేదీనే బీఎన్పీ ఛైర్మన్ తారిక్ రెహమాన్.. బంగ్లాదేశ్ నూతన ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే ఢాకాలోని పార్లమెంట్ హౌస్ సదరన్ ప్లాజా వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ఆహ్వానం అందింది.
ఎవరెవరికి ఆహ్వానం అందిందంటే..?
ఫిబ్రవరి 17వ తేదీన ఉదయం నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతుంది. అనంతరం సాయంత్రం వేళ ప్రధాన మంత్రిగా తారిక్ రెహమాన్, ఆయన కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎమ్ఎమ్ నాసిర్ ఉద్దీన్ ఈ ప్రమాణ స్వీకార ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత్, చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా సహా మొత్తం 13 దేశాల అధినేతలకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ అధికారికంగా ఆహ్వానాలు పంపారు.
మోదీ వెళ్లే అవకాశం ఉందా, లేదా?
ముఖ్యంగా ఈ వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. అయితే అదే రోజు ముంబైలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో కలిసి ప్రధాని మోదీకి భేటీ కానున్నారు. గతంలోనే ఈ సమావేశాన్ని నిర్ణయించగా.. ఆయన ఈ పర్యటనకు హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం. ప్రధాని మోదీ స్థానంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ భారత్ తరపున ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తారిక్ రెహమాన్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం భారత్తో ఎలా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారుతోంది. గతంలో బీఎన్పీ హయాంలో కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ.. ఈసారి ఆ పార్టీ నేతలు ప్రాంతీయ సహకారం, వాణిజ్యం, స్థిరత్వం గురించి సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ ఏ స్థాయిలో ఈ వేడుకకు ప్రాతినిధ్యం వహిస్తుందనే దానిపై ఇరు దేశాల భవిష్యత్ సంబంధాలు ఆధారపడి ఉంటాయని దౌత్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa