ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"బంగ్లాదేశే మాకు మొదటి ప్రాధాన్యత": ,,,తారిక్ రెహమాన్

international |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 09:10 PM

బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధినేత తారిక్ రెహమాన్ తన దేశ భవిష్యత్తు, విదేశీ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఢాకాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ విదేశీ విధానం కేవలం దేశ ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షల చుట్టూనే తిరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత్‌తో సంబంధాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమకు బంగ్లాదేశే మొదటి ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు.


ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రజలు బీఎన్‌పీకి అఖండ విజయాన్ని అందించారని తారిక్ రెహమాన్ కొనియాడారు. బంగ్లాదేశ్, అక్కడి ప్రజల ప్రయోజనాలే తమ విదేశీ విధానాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. ముఖ్యంగా తమ దేశ ప్రయోజనాలను రక్షించుకుంటూనే.. ఇతర దేశాలతో సంబంధాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నిర్ణయించుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కేవలం ఒక దేశానికే పరిమితం కాకుండా.. 'బహుళ పక్ష విధానాన్ని' అనుసరిస్తామని బీఎన్‌పీ సీనియర్ నేత అమీర్ ఖస్రు మహ్మద్ చౌదరి తెలిపారు.


బంగ్లాదేశ్‌తో సంబంధాలపై భారత్ వైఖరి


బంగ్లాదేశ్‌లో ఎన్నికైన ప్రభుత్వం తిరిగి రావడాన్ని భారత్ ఒక గొప్ప అవకాశంగా భావిస్తోంది. తారిక్ రెహమాన్ నాయకత్వంపై భారత అధికారులు "జాగ్రత్తతో కూడిన ఆశావాదం" వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తారిక్ రెహమాన్‌తో మాట్లాడి, ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయానికి అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని మోదీ పునరుద్ఘాటించారు.


బీఎన్‌పీ అంతర్జాతీయ వ్యవహారాల ప్రతినిధి హుమాయూన్ కబీర్ మాట్లాడుతూ.. తమ ప్రాధాన్యత ప్రజల మధ్య సహకారాన్ని పెంచడమేనని అన్నారు. "ముందుగా మా దేశీయ అంశాలపై దృష్టి పెడతాం. ఆ తర్వాత అంతర్జాతీయ పర్యటనలు ఉంటాయి. ఖచ్చితంగా మేము పర్యటించే దేశాల జాబితాలో భారత్ మొదటి వరుసలోఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ ఆసియా దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం తాము ఆసక్తిగా ఉన్నామని కబీర్ పేర్కొన్నారు.


ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం.. మొత్తం 299 స్థానాలకు గానూ బీఎన్‌పీ ఏకంగా 212 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. జమాత్-ఇ-ఇస్లామీ నేతృత్వంలోని కూటమి కేవలం 77 స్థానాలకే పరిమితమైంది. ఈ భారీ మెజారిటీ తారిక్ రెహమాన్ ప్రభుత్వానికి పూర్తి స్థాయి అధికారాలను, అంతర్జాతీయ వేదికలపై గట్టిగా మాట్లాడే అవకాశాన్ని కల్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa