ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొత్స సత్యనారాయణకు కిరాక్ ఆర్పీ క్షమాపణలు, మళ్లీ ట్విస్ట్.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 09:50 PM

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు కిరాక్ ఆర్పీ క్షమాపణలు చెప్పారు. తాను ఎవరినీ కించపరచలేదని.. అయినప్పటికీ బొత్స సత్యనారాయణ కు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. "బొత్స సత్యనారాయణ మీద చేసిన నేను చేసిన వీడియో ఆయనను, ఆయన అభిమానులను బాధపెట్టినట్లు తెలిసింది. నేను తీవ్రంగా చింతిస్తున్నా. నేను వ్యక్తిగత విమర్శలు చేయలేదు. నేను బూతులు తిట్టలేదు. బాడీ షేమింగ్ చేయలేదు. ఏ సామాజికవర్గాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని నేను మాట్లాడలేదు. సీఎం చంద్రబాబు నాయుడును అంబటి రాంబాబు బహిరంగంగా దుర్భాషలాడిన తీరును వెనుకేసుకువచ్చిన పద్ధతి నచ్చక.. ఇమిటేట్ చేశా. అంతేకానీ తీవ్రమైన ఆరోపణలు చేయలేదు. ఏదేమైనా బొత్స సత్యనారాయణ గారికి క్షమాపణలు తెలియజేస్తున్నా. " అని కిరాక్ ఆర్పీ వీడియో విడుదల చేశారు.


అయితే ఇదే సమయంలో వైసీపీ పై కిరాక్ ఆర్పీ విమర్శలు గుప్పించారు. కేవలం ఇమిటేట్ చేసినందుకే వైసీపీ వాళ్లు ఇంత బాధపడినప్పుడు.. వైసీపీ నేతలు గతంలో మాట్లాడిన మాటలకు కూడా క్షమాపణలు చెప్పాలని కిరాక్ ఆర్పీ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబును ఉద్దేశించి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యల వీడియోను చూపించారు. అలాగే టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు గురించి అసెంబ్లీలో వైఎస్ జగన్ మాట్లాడిన మాటలు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై బియ్యపు మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలు, పీతల సుజాత గురించి రోజా వ్యాఖ్యలు చేశారంటూ కిరాక్ ఆర్పీ వీడియోలు చూపించారు. బొత్స సత్యనారాయణకు తాను క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో.. ఆయన కూడా వీటన్నింటికీ వైసీపీ నేతలతో క్షమాపణలు చెప్పాలని కిరాక్ ఆర్పీ డిమాండ్ చేశారు.


మరోవైపు చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ కిరాక్ ఆర్పీ మాట్లాడారు. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణను ఇమిటేట్ చేశారు. అయితే ఇది కాస్తా వివాదాస్పదమైంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను కిరాక్ ఆర్పీ అవమానించారంటూ వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భగ్గుమన్నారు.


సోషల్ మీడియా వేదికగా కిరాక్ ఆర్పీపై విరుచుకుపడ్డారు. మల్లేశ్వరి వంటి నేతలు కిరాక్ ఆర్పీకి వార్నింగ్ కూడా ఇచ్చారు. నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే.. 2029 తర్వాత ఆలయాల వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బొత్స సత్యనారాయణకు క్షమాపణలు చెప్పిన కిరాక్ ఆర్పీ.. ఆ తర్వాత టీడీపీ నేతలకు కూడా వైసీపీ వాళ్లు సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa