టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు తొలి దశను విజయవంతంగా ముగించింది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన టీమిండియా తదుపరి దశకు అర్హత సాధించింది. లీగ్ దశలో సూర్య సేన అన్ని మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ.. అమెరికా, నెదర్లాండ్స్ లాంటి జట్లపైనా సాధికారిక విజయాలు సాధించలేకపోయింది. జట్టులో కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా మన బ్యాటర్లు ఆఫ్ స్పిన్ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డారు.
అమెరికాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత బ్యాటర్లు పవర్ ప్లేలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. అతిజాగ్రత్తగా ఆడటంతో తొలి ఆరు ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 46 పరుగులే చేయగలిగింది. నమీబియాపై పవర్ ప్లే ముగిసే సమయానికి 86/1తో నిలిచిన భారత్.. తర్వాతి 8 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 58 పరుగులే చేయగలిగింది. సూర్య-తిలక్ జోడీ మూడో వికెట్కు 18 బంతులు ఎదుర్కొని 16 పరుగులే జోడించింది.
పాకిస్థాన్తో మ్యాచ్లో 40 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ భారత్కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేసిన సూర్య-తిలక్ జోడి 34 బంతుల్లో 38 పరుగులే చేసింది. వన్డే తరహాలో ఆడిన వీరు బంతికి ఒక పరుగు చొప్పున మాత్రమే రన్స్ రాబట్టారు. నెదర్లాండ్స్తో మ్యాచ్లోనూ అలాగే జరిగింది. పవర్ ప్లే ముగిశాక, తర్వాతి ఓవర్లలో భారత బ్యాటర్లు మెల్లగా ఆడారు. సూర్య-తిలక్ జోడి 28 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేసింది.
ఈ టీ20 వరల్డ్ కప్లో తిలక్ మూడో స్థానంలో, సూర్య నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్నారు. మామూలుగానైతే వీరిద్దరూ దూకుడుగా ఆడతారు. కానీ ప్రత్యర్థి జట్లు స్పిన్ అస్త్రాన్ని ప్రయోగిస్తుండటం, పిచ్ స్లోగా ఉంటుండంతో వీరిద్దరూ తమ సహజ శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడటం లేదు.
పాకిస్థాన్తో మ్యాచ్లో భారత బ్యాటర్లు స్పిన్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన నెదర్లాండ్స్ కూడా తర్వాతి మ్యాచ్లో అదే ప్లాన్ను అమలు చేసింది. పవర్ ప్లేలో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి.. భారత బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేసింది. ఇండియాతో మ్యాచ్ ముగిశాక నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో నెదర్లాండ్స్ కెప్టెన్ బాస్ డీ లీడే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఆర్యన్ దత్ తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మను ఔట్ చేయడంతోపాటు.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ను సైతం ఔట్ చేశాడు. డచ్ స్పిన్నర్ల దెబ్బకు భారత్ 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులే చేయగలిగింది.
‘పిచ్ స్లోగా ఉంది. ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి ఇది కఠినమైన పిచ్. నెమ్మదిగా బంతులేస్తే స్పిన్నర్లు, పేసర్లకు కూడా సహకారం లభించింది. 31 బంతుల్లో 66 రన్స్ చేసిన దూబే కూడా అందుకే మెల్లగా ఆట మొదలుపెట్టాడు. దూబే బాగా ఆడాడు, అదే సమయంలో మేం కూడా చక్కగా బంతులేసి, ఇండియా బ్యాటర్లు దూకుడుగా ఆట మొదలుపెట్టకుండా అడ్డుకున్నాం’’ అని డీ లీడే వ్యాఖ్యానించాడు.
‘సర్, ఇది వరల్డ్ కప్. గేమ్ కొంచెం కష్టంగా ఉంది, అంత తేలికైన మ్యాచ్ కాదు. మేం ఆశించిన ఆరంభం లభించకపోతే.. తిలక్, సూర్య ఆట భిన్నంగా ఉంటుంది. పరిస్థితికి తగ్గట్టుగా వారు ఆడాల్సి ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో తిలక్ ఆడాల్సి వస్తే.. అతడు దానికి తగ్గట్టే ఆడతాడు. సూర్య గురించి నేను చెప్పడానికేం లేదు. తను జట్టును మెరుగైన స్థితికి తీసుకెళ్లే ఆటగాడు’ అని దూబే తెలిపాడు.
ఈ వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ వరుసగా మూడుసార్లు డకౌట్ కావడంతో.. తిలక్ వర్మ రెండో ఓవర్లోనే బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది. ఆరంభంలోనే వికెట్ పడటం, తాను ముందే బ్యాటింగ్కు దిగాల్సి రావడం భారత్ను ఇబ్బందిపెట్టింది. అదే సమయంలో ప్రత్యర్థి జట్టులోని స్పిన్నర్లు, పేసర్లు వైవిధ్యాన్ని చూపిస్తూ తెలివిగా బంతులేశారు.
సూపర్-8లో భారత ప్రత్యర్థి జట్లయిన సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు కూడా ఇదే పని చేస్తాయని భావించొచ్చు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్లో భారత బ్యాటర్లు వేగంగా పరుగులు రాబట్టలేక పోతున్నారు. తిలక్, సూర్య లెఫ్ట్-రైట్ కాంబినేషన్ అయినప్పటికీ.. ఇప్పటి దాకా ఉపయోగం లేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడం అనేది ఈ దశలో అంత మంచి ఆలోచన కాదు. కానీ ఆటగాళ్ల దృక్పథంలో మార్పు రావాలి. కీలకమైన ఈ దశలో అభిషేక్ శర్మ పుంజుకోవడం ఎంతో అవసరం. ఓపెనర్లు శుభారంభం అందిస్తే.. తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి సహజంగానే తగ్గుతుంది. అప్పుడు వారు కూడా బ్యాట్ ఝులిపించగలుగుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa