వేసవి సెలవుల్లో హిమాచల్ ప్రదేశ్లోని చల్లని కొండ ప్రాంతాలకు వెళ్లాలనుకునే పర్యాటకులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన కొత్త టోల్ పాలసీని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాలపై టోల్ రుసుమును భారీగా పెంచునున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ కార్లపై ఏకంగా 140 శాతానికి పైగా భారం పడనుంది.
కార్లకు రూ.70 నుంచి రూ.170కి పెంపు
కొత్త పాలసీ ప్రకారం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్లు, జీపులు, వ్యాన్ల వంటి తేలికపాటి వాహనాలపై ప్రస్తుతం ఉన్న రూ.70 టోల్ ఫీజును ఏకంగా రూ.170కి పెంచారు. అంటే ఒక్కో కారుపై రూ.100 అదనపు భారం పడనుంది. అయితే హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలకు ఈ టోల్ పన్ను నుంచి ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది.
వివిధ వాహనాల కొత్త రేట్లు ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55 టోల్ బారియర్ల వద్ద వసూలు చేసే రుసుములను వాహన శ్రేణిని బట్టి పెంచారు. మినీ బస్సులు, లైట్ కమర్షియల్ వాహనాలకు రోజుకు రూ.320 వసూలు చేయనున్నారు. అలాగే మూడు యాక్సిల్స్ గల కమర్షియల్ వాహనాలు రూ.600 రుసుము నిర్ణయించారు. భారీ నిర్మాణ యంత్రాలు అయిన జేసీబీ వంటి వాటికి రూ.800 వసూలు చేస్తారు. అతి భారీ వాహనాలు అంటే 7 అంతకంటే ఎక్కువ యాక్సిల్స్ కల్గిన వాహనాలకు రూ.900 తీసుకుంటారు. అయితే బస్సులు, ట్రక్కుల రేట్లలో ఎలాంటి మార్పు లేదు. పాత ధర ప్రకారం ఒక్కో రోజుకు రూ.570 మాత్రమే వసూలు చేస్తారు.
ఫాస్టాగ్ తప్పనిసరి.. ట్రాఫిక్ కష్టాలకు చెక్!
టోల్ గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి వేచి ఉండకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని టోల్ బారియర్ల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేసింది. అలాగే సోలన్ జిల్లాలోని పర్వానూ, టిప్రా బైపాస్, బిలాస్పూర్ జిల్లాలోని గరమౌరా వద్ద మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోల్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. టోల్ నిర్వహణలో పారదర్శకత కోసం వేలం ప్రక్రియను ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న రవాణాదారులు
ప్రభుత్వ నిర్ణయంపై హిమాచల్ ప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉనా-నైనా దేవి, ఉనా-జసూర్ వంటి అంతర్గత రవాణా మార్గాల్లో కూడా టోల్ వసూలు చేయడం సరికాదని పేర్కొంటున్నారు. ఈ పెంపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని.. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa