ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని ఉద్ఘాటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 05:40 PM

సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన 'స్వచ్ఛ రథాన్ని', ఈ-ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు.ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు.దేశంలో ఏ రాష్ట్రమూ ఏపీకి దరిదాపుల్లో లేనంత సంక్షేమాన్ని అందిస్తున్నాం. మొదటి తారీఖునే పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నాను. 'తల్లికి వందనం' ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఆర్థిక సాయం అందిస్తున్నాం.అన్నదాత సుఖీభవ' కింద రైతులకు మూడు విడతల్లో రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం అని వివరించారు.మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. "స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. వారు ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లక్ష మంది మహిళలను ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దుతున్నాం" అని పేర్కొన్నారు. పీ4 కార్యక్రమం కింద ఇప్పటివరకు 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నామని, వారికి మార్గనిర్దేశం చేసేందుకు లక్ష మంది మార్గదర్శులు ముందుకు వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 561 స్వయం సహాయక సంఘాలకు రూ.100.14 కోట్ల చెక్కును అందించారు.పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. "దేశంలో ఏ రాష్ట్రం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందించడం లేదు. త్వరలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో శిక్షణ ఇచ్చేందుకు ఏఐ ట్యూటర్‌ను తీసుకువస్తున్నాం. ఇటీవల బిల్ గేట్స్ కూడా రాష్ట్రానికి వచ్చి రైతులు టెక్నాలజీని వినియోగిస్తున్న తీరును చూసి ఆనందం వ్యక్తం చేశారు" అని గుర్తుచేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం కోసం యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువస్తున్నామని, పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ద్వారా రూ.25 లక్షల వరకు చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. వ్యవసాయంలోనూ టెక్నాలజీని ప్రవేశపెట్టి సాగును సులభతరం చేస్తామన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెట్ ధర అందేలా, సాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినుకొండను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే ఆలోచన ఉందన్నారు.స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే 'స్వచ్ఛాంధ్ర' లక్ష్యమని సీఎం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోందన్నారు. "గత పాలకులు వదిలేసిన 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించే బృహత్తర కార్యక్రమం చేపట్టాం. మార్చి నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం డోర్ టు డోర్ చెత్త సేకరణ పూర్తి చేస్తాం" అని ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించామని, దీనివల్ల పశువులు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని వివరించారు.చెత్తను సంపదగా మార్చే ప్రక్రియను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. "విశాఖ, గుంటూరులలో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు ఉన్నాయి. రాజమండ్రితో పాటు మరో 5 ప్లాంట్లు త్వరలో ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 4 లక్షలకు పైగా కుటుంబాలు హోం కంపోస్టింగ్ ద్వారా ఎరువు తయారు చేసుకుంటున్నాయి" అని ప్రశంసించారు. చెత్త నిర్వహణలో జపాన్ పౌరుల తరహాలో మన ఆలోచనా తీరు మారాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa