ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వచ్ఛ రథం.. చెత్త ఇస్తే, సరుకులు ఇస్తారు.. చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 05:53 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పరిశుభ్రతను పెంచేలా ప్రతి మండలంలోనూ ఓ స్వచ్ఛరథం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే పలు స్టాళ్లను సందర్శించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. ప్రతి మండలంలోనూ స్వచ్ఛరథం ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ స్వచ్ఛరథం వారానికి ఓ రోజుగ్రామాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛరథం వచ్చిన సమయంలో ప్రజలు తమ వద్ద ఉన్న చెత్తను అందించి.. వాటికి బదులుగా నిత్యావసర సరుకులు ఉచితంగా పొందవచ్చని చంద్రబాబు ప్రకటించారు. మార్చి 31వ తేదీ నాటికి ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని చంద్రబాబు వివరించారు.


వైసీపీపై విమర్శలు..


మరోవైపు ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో చెత్త పేరుకుపోయిందని ఆరోపించారు. 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రాష్ట్రంలో పేరుకుపోయిందన్న చంద్రబాబు.. ఆ చెత్తను తొలగించే పనిలో ఉన్నట్లు వివరించారు. అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం తీసుకువచ్చినట్లు వివరించారు. మున్సిపాలిటీలలో ప్రతి ఇంటి వద్ద చెత్త సేకరణ జరుగుతోందన్న సీఎం..మార్చి 31 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ పద్ధతి తెస్తామన్నారు.


సూపర్ సిక్స్.. సూపర్ హిట్..


ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తున్నామని చంద్రబాబు అన్నారు. పెంచిన పింఛన్ ప్రతినెలా ఒకటో తేదీనే ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ అందరికీ తల్లికి వందనం అందిస్తున్నట్లు వివరించారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నామని.. వారి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వ్యవసాయంలో టెక్నాలజీ వాడకం పెంచుతున్నామని.. వ్యవసాయ నిపుణులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్న చంద్రబాబు.. పేదల కోసం పీ4 కార్యక్రమం అమలు చేస్తున్నామని వివరించారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa