ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ టీవీలో కనిపిస్తే ప్రజలు భయపడుతున్నారని ఉదయనిధి స్టాలిన్ ఎద్దేవా

national |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 09:07 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తమిళనాడు ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోయంబత్తూరు జిల్లా కనియూర్‌లో డీఎంకే యువజన విభాగం పశ్చిమ మండల కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన, బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ ముఖానికి తమిళ ప్రజలు నలుపు రంగు పూసి, తగిన రాజకీయ సమాధానం ఇస్తారు అని ఆయన వ్యాఖ్యానించడంతో పార్టీ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన టీవీలో కనిపిస్తే చాలు ప్రజల్లో ఆందోళన మొదలవుతోందని ఉదయనిధి ఎద్దేవా చేశారు. గతంలో ఆకస్మికంగా ప్రకటించిన కరోనా లాక్‌డౌన్‌, పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు, తీవ్ర కష్టనష్టాలు సృష్టించాయని గుర్తుచేశారు.ప్రజలకు ఇచ్చేది డీఎంకే ప్రభుత్వం అయితే, ప్రజల నుంచి డబ్బులు లాక్కునేది బీజేపీ ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. ఇటీవల కారైకాల్‌లో పర్యటించిన అమిత్ షాను ఉద్దేశించి మీరు ఎన్ని రంగులు పూసుకున్నా, ఎన్నికల్లో తమిళ ప్రజలు మీ ముఖానికి నలుపు పూయడం ఖాయం అని అన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థలకు, ప్రధాని మోదీకి తాము భయపడబోమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.మేం ఈడీకి భయపడం, మోదీకి భయపడం. ఎన్నికలను సాకుగా చూపి అభివృద్ధి పథకాలను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అని విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆ పార్టీ స్వాతంత్ర్యాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కొందరు మా ఉద్యమాన్ని నాశనం చేయాలని పగటి కలలు కంటున్నారు. కానీ డీఎంకేను ఎప్పటికీ ఎవరూ కూల్చలేరు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశానికి పాలన, రాజకీయాల్లో తన తండ్రి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మార్గదర్శకంగా నిలుస్తున్నారని, ఆయన నాయకత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పోరాటం చేయాలని పలు రాష్ట్రాల నేతలు ఆకాంక్షిస్తున్నారని ఉదయనిధి తెలిపారు.రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై కూడా ఉదయనిధి విమర్శలు గుప్పించారు. తమిళనాడులో ఎన్ని పోలింగ్ బూత్‌లు ఉన్నాయో కూడా తెలియకుండా కొందరు సర్వేలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa