ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తక్షణమే ఇరాన్‌ నుంచి వచ్చేయండి.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ

national |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 07:16 PM

అమెరికా, ఇరాన్‌ మధ్య జరుగుతున్న అణు చర్చల్లో ప్రతిష్ఠంభనతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకున్నాయి. అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు ఇరాన్‌కు సమీపంగా మోహరించడంతో ఏ క్షణమైన దాడి జరగొచ్చనే అందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఇరాన్‌లోని తమ పౌరులకు పలు దేశాలు హెచ్చరికలు చేస్తున్నాయి. తక్షణమే ఆ దేశం వీడాలని సూచిస్తున్నాయి. తాజాగా, భారత్ కూడా అక్కడ ఉన్న తన పౌరులకు అడ్వైజరీ జారీేసింది. తక్షణమే ఇరాన్‌ను వీడాలని అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్‌లో విద్యార్థులు మరోసారి రోడ్లపైకి రావడంతో ఎఫ్పుడు ఏం జరగుతుందో తెలియని పరిస్థితి నెలకుంది. ఈ క్రమంలోనే భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది.


‘‘ఇరాన్‌లో నెలకున్న పరిస్థితుల దృష్ట్యా.. జనవరి 5న భారత సర్కారు వెలువరించిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్లీ హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు (విద్యార్థులు, పర్యటకులు, వ్యాపారవేత్తలు, యాత్రికులు) అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా తక్షణమే ఇరాన్‌ను వీడండి.. భారతీయులు, భారత సంతతికి చెందినవారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.. నిరసనలు, ఆందోళనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి... అలాగే అక్కడ జరుగుతోన్న పరిణామాలపై స్థానిక మీడియాను గమనిస్తూ ఉండాలి. అలాగే, పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులతో సహా తమ ప్రయాణ, ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ విషయంలో సహాయం కోసం భారత ఎంబసీని సంప్రదించాలి... అలాగే, ఇప్పటివరకు మీ పేర్లు ఎంబసీ వద్ద నమోదు చేసుకోకపోతే వెంటనే రిజిస్టర్‌ చేయించుకోండి’’ అని అడ్వైజరీలో భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.


ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య రెండు విడతలుగా జరిగిన అణు చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో బెదిరింపులకు దిగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌... ఒప్పందం చేసుకోకుంటే దాడులు తప్పవనే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే యుద్ధ నౌకలు, సబ్-మెరైన్లు, యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు పంపింది. ఇదే సమయంలో రాజధాని టెహ్రాన్‌లో మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఇరాన్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ట్రంప్, ఆయతుల్లా అలీ ఖమేనీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో పశ్చిమాసియా మరింత వేడెక్కింది. ఇక, గతవారం జెనీవాలో చర్చలు మూడు గంటల్లోనే ముగిసిన తర్వాత.. ఇరాన్ హర్మూజ్ జల సంధిని తాత్కాలికంగా మూసివేసి, క్షిపణి విన్యాసాలు నిర్వహించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa