శ్రీకాకుళం పట్టణంలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా ప్రబలడం, రాజమండ్రిలో కల్తీ పాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం వంటి తీవ్రమైన ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మున్సిపల్, వైద్యారోగ్య శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ రెండు విషాద ఘటనల్లో ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏమాత్రం ఉపేక్షించవద్దని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కావాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "ఘటన జరిగాక స్పందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ముందస్తు పర్యవేక్షణ, అప్రమత్తత ద్వారా ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలి. శ్రీకాకుళంలో తాగునీరు కలుషితమైన ఘటనలో ముందస్తు తనిఖీలు జరిగి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు" అని అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ప్రతి ప్రభుత్వ విభాగంలో కింది స్థాయి యంత్రాంగాన్ని క్రియాశీలం చేసేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతి అధికారి విధిగా పర్యటించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa