ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"దెబ్బలు తింటూ ఊరుకోం": ..... మార్కో రూబియో

international |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 07:46 PM

మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ.. ఇరాన్‌పై అమెరికా జరిపిన మెరుపు దాడులకు సంబంధించిన సంచలన వాస్తవాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతోందని తెలిసిన తర్వాత.. తమ సైనికుల ప్రాణాలను కాపాడుకోవడానికే అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రక్షణ కోసం చూస్తూ కూర్చుంటే అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చేదని ఆయన హెచ్చరించారు.


ముందస్తు దాడి ఎందుకు?


సోమవారం విలేకరులతో మాట్లాడిన రూబియో.. ఇరాన్‌పై దాడికి గల కారణాలను విశ్లేషించారు. "ఇజ్రాయెల్ దాడి చేయబోతోందని మాకు తెలుసు. ఆ దాడి జరిగిన వెంటనే ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా బలగాలపై ప్రతీకార దాడులకు దిగుతుందని మా వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. ఒకవేళ మేము ముందే అప్రమత్తమై వారి క్షిపణి వ్యవస్థలను దెబ్బ తీయకపోతే.. మా సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. అందుకే ఎదురుదెబ్బ తినడం కంటే ముందే శత్రువును దెబ్బకొట్టాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అత్యంత తెలివైనది" అని ఆయన పేర్కొన్నారు.


రంగంలోకి క్షేత్రస్థాయి కమాండర్లు


ఇరాన్ తన క్షేత్రస్థాయి కమాండర్లకు ఇచ్చిన ఆదేశాలను కూడా మార్కో రూబియో ఈ సందర్భంగా ప్రస్తావించారు. "అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులు చేస్తే.. పైఅధికారుల అనుమతి కోసం ఎదురు చూడకుండా తక్షణమే అమెరికా స్థావరాలపై దాడులు చేయాలని ఇరాన్ తన సైన్యానికి సూచించింది. ఒకవేళ ఇరాన్ మొదటి దెబ్బ కొట్టే వరకు మేము వేచి చూసి ఉంటే.. 'మీకు తెలిసినా ఎందుకు ఆపలేదు?' అని ఈరోజు మీరందరూ నన్ను ప్రశ్నించేవారు" అని రూబియో సమాధానం ఇచ్చారు.


ఇదీ చూడండి: 'నిన్నే ఫోన్‌లో మాట్లాడా, ఇజ్రాయెల్‌కు అండగా నిలబడ్డందుకు మోదీకి థాంక్స్': నెతన్యాహు


అమెరికాలో రాజకీయ దుమారం


అయితే రూబియో వ్యాఖ్యలపై డెమొక్రాట్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రతినిధి జ్వాక్విన్ కాస్ట్రో స్పందిస్తూ.. "ఇరాన్‌పై దాడికి పట్టుబట్టడం ద్వారా ఇజ్రాయెల్ మన సైనికులను ప్రమాదంలోకి నెట్టింది. మన మిత్ర దేశమని చెప్పుకునే దేశం ఇలా చేయడం అంగీకార యోగ్యం కాదు" అని విమర్శించారు. అంతకుముందు రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ.. శనివారం టెహ్రాన్‌లో ఖమేనీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశమైన సమయంలో ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసి వారిని హతమార్చినట్లు ధృవీకరించారు.


అసలు లక్ష్యం ఏమిటి?


ఇరాన్ ప్రభుత్వ మార్పు తమ ప్రస్తుత లక్ష్యం కాదని మార్కో రూబియో స్పష్టం చేశారు. "ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలని మేము కోరుకుంటున్నాము. కానీ ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం మాత్రం ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని, నౌకాదళ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయడమే" అని ఆయన కుండబద్దలు కొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa