సామాన్య అకౌంట్ హోల్డర్లపై బ్యాంకులు జరిమానాల రూపంలో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఖాతాల్లో కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) లేదనే నెపంతో గత మూడేళ్లలో (2022-23 నుండి 2024-25 వరకు) ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు కలిపి ఏకంగా ₹19,000 కోట్లను ఖాతాదారుల నుండి వసూలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభలో వెల్లడించిన ఈ గణాంకాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
ఈ భారీ వసూళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకుల వాటానే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం ₹19,000 కోట్లలో ప్రైవేట్ బ్యాంకులు ₹11,000 కోట్లు దండుకోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSUs) ₹8,000 కోట్లను జరిమానాల రూపంలో ఖాతాదారుల నుంచి సేకరించాయి. సేవల పేరిట బ్యాంకులు విధిస్తున్న ఈ భారంతో సామాన్య మరియు మధ్యతరగతి ప్రజల పొదుపుపై తీవ్ర ప్రభావం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రైవేట్ రంగంలో చూసుకుంటే, ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం HDFC అత్యధికంగా ₹3,872 కోట్లను మినిమం బ్యాలెన్స్ ఫైన్ల ద్వారా ఆర్జించి అగ్రస్థానంలో నిలిచింది. కఠినమైన నిబంధనలు, పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉండే కనీస నిల్వ పరిమితుల కారణంగానే ప్రైవేట్ బ్యాంకులకు ఈ స్థాయిలో ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి వచ్చే ఈ రాబడి బ్యాంకులకు అదనపు లాభాలను తెచ్చిపెడుతోంది.
మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) అత్యధిక వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఈ బ్యాంక్ ఒక్కటే సుమారు ₹1,578 కోట్లను పెనాల్టీల రూపంలో ఖాతాదారుల నుండి సేకరించింది. సాధారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆశ్రయించే ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా ఈ స్థాయిలో జరిమానాలు వసూలు చేయడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa