ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెన్యా నుంచి రాణీ చీమలు అక్రమంగా తరలింపు,,,ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన చైనా పౌరుడు

international |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 10:38 PM

రాణీ చీమలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ చైనా పౌరుడ్ని కెన్యా రాజధాని నైరోబీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతడి వద్ద 2 వేలకుపైగా రాణీ చీమలున్నట్టు అధికారులు గుర్తించారు. జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఝాంగ్ కెక్వన్‌ అనే చైనీయుడ్ని భద్రతా తనిఖీల సమయంలో పట్టుబడ్డాడు. తన లగేజీలో రాణి చీమలను ఉంచి చైనాకు తీసుకెళ్తున్నట్టు బయటపడింది. అయితే, ఈ ఆరోపణలపై నిందితుడు ఇంకా స్పందించలేదు. అయితే, కెన్యాలో గతేడాది బయటపడిన చీమల అక్రమ రవాణా ముఠాలతో ఇతకి సంబంధం ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు.


ఇంటర్నేషనల్ జీవ వైవిధ్య ఒప్పందాల ప్రకారం.. అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఈ చీమలు కూడా ఉన్నాయి. వాటిని అనుమతిలేకుండా తరలించడం నిషేధం. మెస్సార్ సెఫలోట్స్‌గా పిలిచే ఈ చీమలకు ఐరోపా, ఆసియాలో డిమాండ్ పెరుగుతోందని గతేడాది కెన్యా వన్యప్రాణి సంరక్షణ సేవలు (కేడబ్ల్యుఎస్) విభాగం హెచ్చరించింది. వీటిని ఐరోపా, ఆసియాలో పెంపుడు జంతువుల మాదిరిగానే భావిస్తారు.


ఇక, ఝాంగ్ కెక్వన్ కొన్ని చీమలను టెస్ట్‌ట్యూబ్‌ల్లోనూ.. మరికొన్నింటిని టిష్యూ పేపర్ రోల్స్‌లో దాచిపెట్టి తన లగేజ్ బ్యాగులో సర్దాడు. అతడు బ్యాగులో 1,948 చీమలను ప్రత్యేక ట్యూబ్‌లలో ఉంచాడని, అవన్నీ ప్రాణాలతోనే ఉన్నాయని కోర్టుకు అధికారులు తెలిపారు. మరో 300 బ్యాగులోని మూడు టిష్యూ పేపర్ రోల్స్‌లో గుర్తించామని కోర్టుకు వివరించారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.


దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని, ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కెన్యాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ చీమలను సేకరిస్తున్నట్టు భావిస్తున్నామని తెలిపారు. వేలాది రాణీ చీమలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన నలుగురికి కెన్యా కోర్టు గతేడాది మేలో ఏడాది జైలు శిక్ష లేదా 7,700 డాలర్ల జరిమానా విధించింది. ఈ తరహా కేసులో కెన్యాలో నమోదుకావడం ఇదే మొదటిసారి. వీరిలో ముగ్గురు విదేశీయులు (ఇద్దరు బెల్జియం, ఒకరు వియత్నాం), మరొకరు కెన్యాకి చెందినవారు. అంతరించిపోయే జీవుల జాబితాలోని ఈ చీమలను తమ హాబీ కోసం సేకరిస్తున్నామని, ఇది చట్టవిరుద్ధమని తమకు తెలియదని కోర్టు వివరించారు.


ఈ స్మగ్లింగ్ వెనుక అసలు సూత్రధారి ఝాంగ్ అని, గతేడాది దొంగ పాస్‌పోర్ట్ ద్వారా కెన్యా నుంచి తప్పించుకున్నట్టు తెలిపారు. అతడ్ని ఐదు రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. గత ఏడాది పట్టుబడిన జీవులు ఆఫ్రికాలో కనిపించే భారీ హార్వెస్టర్ గింజలను సేకరించే రాణీ చీమలని అధికారులు వెల్లడించారు. పర్యావరణానికి ఇవి అత్యంత కీలకమని, ఇవి లేకుంటే మట్టికి, జీవ వైవిధ్యానికి నష్టం కలుగుతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa