ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లిలో అతిగా ఖర్చు చేశాడు,,,,అడ్డంగా బుక్కయ్యాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 06:29 PM

కృష్ణా జిల్లా పెడనలోని ఓ బంగారం దుకాణంలో గుమస్తాగా పని చేసే ఓ యువకుడు ఇటీవల వివాహం చేసుకున్నాడు. వివాహానికి భారీ ఏర్పాట్లు చేశాడు. తన స్థాయికి మించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ పెళ్లికి నగల షాపు యజమానులు కూడా హాజరయ్యారు. తమ వద్ద గుమస్తాగా పని చేసే యువకుడు.. వివాహానికి ఇంత ఘనంగా ఎలా ఏర్పాట్లు చేశాడనే అనుమానం ఆ వ్యాపారులకు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన బంగారం దుకాణం యజమానులు అకౌంట్లు సరిచూసుకోగా.. ఆభరణాల లెక్కల్లో భారీ తేడా కనిపించింది. దాదాపు రూ.1.50 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం చేసినట్లు తెలిసింది. పెడనకే చెందిన అతను ఆ దుకాణంలో ప్రధాన గుమస్తాగా బాధ్యతలు నిర్వర్తించేవాడని పోలీసులు తెలిపారు. యజమానులు మరో చోట ఉంటారని.. దానిని అవకాశంగా తీసుకొని కొంతకాలంగా అతడు బంగారం, వెండి ఆభరణాలను పక్కదారి పట్టించాడని పోలీసులు తెలిపారు. నెల కిందట యువకుడి వివాహం జరగ్గా.. కొన్ని రోజుల తర్వాత దుకాణం యజమానులు యువకుడిని ప్రశ్నించటంతో అసలు విషయం బయటపడిందన్నారు. యజమానులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. యువకుడి ఇంటి నుంచి యజమానులు.. వెండి బిందెలు, రూ.లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.


కాగా, నమ్మి దుకాణం అప్పగిస్తే ఇలా మోసం చేయటం పట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మకంగా ఉంటూనే ద్రోహం చేశాడని అంటున్నారు. ప్రస్తుతం ఎవర్ని నమ్మాలో అర్థం కాని పరిస్థితి ఉందని వాపోతున్నారు. పోలీసులు సైతం ఈ ఘటనను ఉదహరిస్తూ యజమానులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చాలా మంది మంచివారిగా నటిస్తూనే మోసాలకు పాల్పడుతుంటారని ఎవరిపైనా గుడ్డి నమ్మకం పెట్టుకోకూడదని హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa