కేంద్ర ప్రభుత్వం Employees’ Provident Fund Organisation ఖాతాదారులకు త్వరలో భారీ గుడ్ న్యూస్ అందించనుంది. పీఎఫ్ బ్యాలెన్స్పై చెల్లించే వార్షిక వడ్డీకి సంబంధించి తాజా నిర్ణయం వెలువడింది.2025–26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు కార్మిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపి కేంద్ర ఆర్థిక శాఖకు పంపించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే వడ్డీ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో త్వరలోనే ఖాతాదారులకు వడ్డీ రూపంలో డబ్బులు అందనున్నాయి.ఇదే సమయంలో ఈపీఎఫ్వో సభ్యులకు మరో శుభవార్త కూడా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.1,000గా ఉంది. దీనిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్ను రూ.7,500 వరకు పెంచాలని వారు కోరుతున్నారు. ఈ అంశంపై Employees’ Provident Fund Organisationలో చర్చలు కొనసాగుతున్నాయి. అలాగే పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షన్ పెంపును సూచించినట్లు సమాచారం.Employees’ Provident Fund Organisation కింద ఉన్న ఈపీఎస్-95 పథకం ద్వారా 58 ఏళ్ల తర్వాత ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ లభిస్తుంది. ఉద్యోగి, యజమాని వాటాల ఆధారంగా ఈ పెన్షన్ లెక్కించబడుతుంది. అయితే గత దశాబ్దాలుగా కనీస పెన్షన్ మార్పు లేకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో కొందరు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించగా, మూడు నెలల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.అదే విధంగా భవిష్యత్తులో పీఎఫ్ నగదు ఉపసంహరణను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకోసం పీఎఫ్ ఖాతాను బ్యాంక్ అకౌంట్తో అనుసంధానించి, ప్రత్యేక డెబిట్ కార్డు జారీ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ఖాతాదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ పీఎఫ్ నిధులను ఉపసంహరించుకునే వీలు కలగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa