శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. తిరుమంజనంలో స్వామి అమ్మవార్లను తులసి, వివిధ సాంప్రదాయ పుష్ప మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. కాగా, సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa