ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఖాయం

national |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2019, 09:15 PM

కాంగ్రెస్ అనుకున్నదొకటి అయినదొకటిలాగా వుంది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని లబ్ది పొందాలని అనుకున్నా మొత్తం ఆందోళన ఇప్పుడు ముస్లిం మత సంస్థల చేతుల్లోకి వెళ్ళింది. ఇది ఆందోళనకర విషయం. పైకి చూడటానికి కాంగ్రెస్ కి అన్నీ అనుకూలంగా అనిపిస్తున్నా లోపల కాంగ్రెస్ కి భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది.రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రాబోతున్నాయనిపిస్తుంది. పౌరసత్వ చట్టం దీనికి నాంది కాబోతుందా? అవుననే అనిపిస్తుంది.


ఇప్పటివరకు దేశరాజకీయాల్లో ముస్లింలు కాంగ్రెస్ గొడుగు కిందగాని, ప్రాంతీయపార్టీలైన సమాజ్ వాది , ఆర్జేడీ , టీఎంసీ లాంటి పార్టీల కిందగాని సమీకరించబడుతున్నారు. మొట్టమొదటిసారి ముస్లింలు స్వతంత్రంగా ఆందోళన చేస్తున్నారు. బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రేరేపిత ఆందోళన కాదు. మొదట్లో అగ్గిరాజేయటానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసినమాట వాస్తవం. కానీ ఇప్పటి ఆందోళన ప్రతిపక్ష పార్టీల చేతుల్లోనుంచి మత సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందనేది వాస్తవం. ఇది స్వతంత్రం తర్వాత అతి పెద్ద మార్పుగా భావించవచ్చు. అయితే ఇప్పటివరకు దీనికి ఒక నాయకుడంటూ లేడు . ముందు ముందు ఈ ఆందోళనలోనుంచే వచ్చే అవకాశం వుంది. ముఖ్యంగా దళిత్-ముస్లిం ఫ్రంట్ ఏర్పడే అవకాశాలు దేశంలో మెండుగా వున్నాయనిపిస్తుంది.


సమీప భవిష్యత్తులో బీజేపీ నే అతిపెద్ద జాతీయ పార్టీగా ఉండబోతుంది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ల్లో ఎక్కడా మెజారిటీ మాట అటుంచి కనీసం పెద్ద పార్టీగా కూడా ఎదగలేక పోతుంది. కాబట్టి కాంగ్రెస్ భవిష్యత్తు ఇప్పటికీ అగమ్యగోచరమే. ఒకవేళ నిజంగానే ముస్లింలు దళితులూ ఒకటై కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ కి ఇప్పుడున్న అవకాశాలు కూడా వుండవు. జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ కి పెద్ద దెబ్బగానే భావించాలి. ఈ ఆందోళన నుంచి రాబోయే పరిణామాలు ఎలావుంటాయో వేచి చూద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa