నిరసన పేరిట హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి.. వారి ఆస్తులను వేలం వేసి.. జరిగిన నష్టాన్ని పూడుస్తాం. మీరు చేసిన పనులు సీసీటీవీలో ఫుటేజీల్లో రికార్డయ్యాయి. ఇందుకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న క్రమంలో యూపీలో సైతం ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొడుతుండగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే పేరిట కాంగ్రెస్ పార్టీ, ఎస్పీ, వామ పక్షాలు దేశాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయని మండిపడ్డారు. లక్నో, సంభాల్లో తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. అదే విధంగా రాష్ట్రంలో పలుచోట్ల 144 సెక్షన్ అమల్లో ఉందని.. అనుమతి లేకుండా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు ఉంటాయని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఆందోళనకారుల కారణంగా సామాన్య పౌరులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోమని అధికారులకు సూచించినట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదని, హింసకు గురై భారత్కు శరణార్థులుగా వచ్చే మైనార్టీలకు మాత్రమే మేలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... సంభాల్లో హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 17 మందిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరిలో పలువురు సమాజ్వాదీ పార్టీ నేతలు, ఎంపీ షఫికర్ రహమాన్ బర్క్ తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa