ఏపీకి నాలుగు రాజధానులు ఉండొచ్చంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న టీజీ.. కానీ విశాఖలో సచివాలయం పెడితే రాయలసీమ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమ నుంచి విశాఖకు వెళ్లాలంటే చాలా కష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
కర్నూలులో ఏర్పాటైన రాజధానిని హైదరాబాద్కు తరలించారని.. అక్కడి నుంచి తరిమేసినట్లే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సీమ ప్రజలను తరిమేస్తారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి, విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసిన మాదిరిగానే కర్నూలులో మిని సచివాలయం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అమరావతిలోనే మిని సచివాలయం ఏర్పాటు చేయాలన్నారు. విశాఖలో సచివాలయం.. అమరావతి, కర్నూలులో మిని సచివాలయాలు ఏర్పాటు చేయాలని టీజీ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో.. హైదరాబాద్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే మిని సచివాలయాలు ఏర్పాటు చేయాలని.. లేకుంటే ప్రాంతీయ అసమానతలు పెరిగి ఉద్యమాలకు దారితీస్తాయన్నారు. అమరావతిని ఫ్రీ జోన్గా పెట్టకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తాయని.. ఎవ్వరైనా అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశాలు లేవన్నారు టీజీ.
సచివాలయం ఒక్క విశాఖలోనే ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని.. అమరావతి, రాయలసీమలో ఉద్యమాలు ప్రారంభమవుతాయని టీజీ చెప్పారు. ముఖ్యమంత్రి మంచి పనులే చేశారన్న ఆయన.. అన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్కి తరలించినప్పుడు తాము కూడా చాలా బాధపడ్డామన్న టీజీ.. ఎవరూ మొండిగా వ్యవహరించకూడదని అమరావతి ప్రాంత ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంత రైతులదే అసలు సమస్య అని.. రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa