ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అచ్చెన్నాయుడికి మరో ఊరట..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 11:32 AM

ఈఎస్‌ఐ స్కాంలో నిందితుడిగా ఉంటూ గుంటూరు ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్‌ నేత,మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి మరో శుభవార్త అందింది. ఇవాళ ఉదయం నిర్వహించిన కోవిడ్‌ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా తేలింది. దీంతో ఆయన్ను రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టయ్యాక గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందిన అచ్చెన్నాయుడును ఆ తర్వాత ఆయన అభ్యర్ధన మేరకు హైకోర్టు గుంటూరు రమేష్‌ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స పొందేందుకు అవకాశం కల్పించింది. అయితే ఆస్పత్రిలో ఉండగానే ఆగస్టు 13న ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన్ను కరోనా చికిత్స అవకాశం లేని రమేష్‌ ఆస్పత్రి నుంచి ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. రెండు వారాల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇవాళ ఉదయం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌గా తేలడంతో వైద్యులు తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
తాజాగా ఈఎస్‌ఐ స్కాం కేసులో హైకోర్టు నుంచి బెయిల్‌ పొందిన అచ్చెన్నాయుడికి కరోనా నెగెటివ్‌గా తేలడంతో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడుకు బెయిల్‌ లభించినా ఆయన ఎన్నారై ఆస్పత్రిలోనే ఉండాల్సి రావడంతో ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు ఇది భారీ ఊరటగానే చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa