తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోఈ నెల 16 న జరగబోయే ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిర్వహించిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది.. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.. ఈ రోజు ఉదయం 6.00 గంటల నుండి ఉ.11.00 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ తిరుమంజన ఉత్సవాన్ని పురస్కరించుకొని అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసింది. ముందుగా స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేసి ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa