అత్తాకోడళ్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కొందరు అత్తా కోడళ్లు ఎంతో కలిసి మెలిసి ఉంటే మరికొందరు అత్తా కోడళ్లు ఉప్పు నిప్పులా ఉంటారు. నిత్యం ఏదో ఒక విషయంలో గొడవలు పడుతుంటారు. కానీ ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునే అత్తాకోడళ్లు ఉన్నారంటే నమ్ముతారా..? ఇది నిజమే. ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓ గ్రామంలో అత్తకోసం కోడలు, మరో గ్రామంలో కోడలి కోసం అత్త నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఇలా త్యాగాలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని చల్లగుండ్ల సర్పంచ్ అభ్యర్థులుగా అత్తకోడళ్లు అయిన బత్తుల బేబీ, బత్తుల ఉమా నామినేషన్లు వేశారు. అయితే ఇక్కడ ఎన్నిక ఏకగ్రీవం కావడం కోసం స్థానిక నేతలు ప్రయత్నాలు చేశారు. అత్తను సర్పంచ్ చేయాలని నిర్ణయించారు. అందుకోసం కోడలు ఉమా తన నామినేషన్ ను వెనక్కి తీసుకుంది. దీంతో అత్త బత్తుల బేబి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మరోవైపు దేవవరం గ్రామ పంచాయతీలో అత్తాకోడళ్లైన భూ లక్ష్మీ, ఆది లక్ష్మీ నామినేషన్లు దాఖలు చేశారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ కోడలిని సర్పంచ్ చేయడం కోసం అత్త అయిన ఆదిలక్ష్మి తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో కోడలు భూలక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని మాతల గ్రామంలో అత్తాకోడళ్లు పంచాయతీ ఎన్నికల్లో తలపడుతున్నారు. అత్తకు టీడీపీ మద్దతుగా నిలుస్తుండగా, కోడలుకు వైసీపీ మద్దతిస్తోంది. అయితే వారిద్దరు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్రావు కుటుంబ సభ్యులు కావడం విశేషం.
మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు సతీమణి కలమట వేణమ్మ టీడీపీ నుంచి..వారి చిన్న కోడలు కలమట సుప్రియ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో నాలుగు సార్లు వేణమ్మ గ్రామ సర్పంచ్గా గెలుపొందారు. అయితే ఈసారి కోడలే వేణమ్మపై పోటీకి నిలవడంతో ఎవరు సర్పంచ్ అవుతారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం వేణమ్మ, సుప్రియలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మెుత్తానికి ఈ ఎన్నిక శ్రీకాకుళం జిల్లాలోనే ప్రత్యేకంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa