ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్, డీజిల్ ధరలు అంతెందుకు పెరుగుతున్నాయ్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 15, 2021, 02:24 PM

చమురు ధరలు వరుసగా గత పది రోజులుగా పెరుగుతూ వున్నాయి. పెట్రోల్ లీటర్ ధర కడపలో రూ. 95 మార్కును దాటింది. నేడు పెట్రో ధరలు వివిధ నగరాల్లో 26 పైసల నుండి 29 పైసల మధ్య, డీజిల్ ధరలు 34 పైసల నుండి 38 పైసల మధ్య పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో ఈ ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడుతోంది. ఫిబ్రవరి నెలలో ఈ 12 రోజుల కాలంలో లీటర్ పెట్రోల్ పైన రూ.4.13, లీటర్ డీజిల్ పైన రూ. 4.26 పెరిగింది. గత 11 నెలల కాలంలో రిటైల్ ధరలు తగ్గలేదు. ఇంధన ధరలు, ప్రధానంగా డీజిల్ ధరలు పెరిగితే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు. పెట్రోల్ ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రధానంగా కరోనా కారణంగా డీలా పడిన డిమాండ్, క్రమంగా పుంజుకుంటోంది. చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి. దీంతో చమురు ధరలు అంతకంతకూ పెరిగి తిరిగి కరోనా పూర్వ స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు మన దేశంలోను ఆ ప్రభావం సహజం. చమురు డిమాండ్ వెనుక ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, ఉత్పత్తి మందగించడం, చమురు ఉత్పత్తి దేశాల్లో అస్థిరత లేదా ఉత్పత్తి కోత వంటి అంశాలు చమురు ధరల పైన ప్రభావం చూపుతాయి. కరోనా నుండి క్రమంగా ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి. ట్రాన్సుపోర్ట్, ఇండస్ట్రీ కార్యకలాపాలు పుంజుకున్నాయి. పారిశ్రామిక రంగం పుంజుకోవడంతో చమురు డిమాండ్ పెరుగుతోంది. అలాగే, వాహనాల సంఖ్య ఇటీవల పెరిగింది. ప్రయివేటు వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో చమురుకు డిమాండ్ పెరిగింది. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే వినియోగదారులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడున్న ధరలు చాలా వరకు దిగి వస్తాయనే వాదనలు ఉన్నాయి. దీంతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే మంచి ఆదాయ వనరు. కాబట్టి దీనిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు వెనుకాడుతున్నాయని చెప్పవచ్చు. కేంద్రం అంగీకరించినా రాష్ట్రాలు అంగీకరించేందుకు దాదాపు సిద్ధంగా లేవు. కేంద్రం కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపింది. కానీ పెట్రోల్, డీజిల్ ఇప్పట్లో జీఎస్టీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అర్థమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa