ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం.వెంకయ్యనాయుడు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. తొలి సెట్పై ప్రధానమంత్రి మోదీ సంతకం చేయగా.. రెండో సెట్పై రాజ్నాథ్ సింగ్ సంతకం చేశారు. భాజపా, తెదేపా, తెరాసకు చెందిన పలువురు ఎంపీలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, అమిత్ షా, అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ సహా పలువురు ఎంపీలు, భాజపా ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఆగస్టు 5న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికలో వెంకయ్యనాయుడు.. యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీతో తలపడనున్నారు. సోమవారం జరిగిన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
కేంద్రమంత్రి పదవికి రాజీనామా : అంతకుముందే వెంకయ్యనాయుడు తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన సారథ్యం వహిస్తున్న పట్టణాభివృద్ధి శాఖను నరేంద్ర సింగ్ తోమర్కు, సమాచార, ప్రసార శాఖ బాధ్యతలను స్మృతి ఇరానీకి అప్పగించారు. ఈరోజు ఉదయం ఆయన భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa