ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో కొడుకు విజయం.. మరునాడే తండ్రి మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Jan 18, 2026, 07:58 PM

కొడుకు పుట్టినప్పుడు కాదు.. అతడు ప్రయోజకుడు అయినప్పుడే తండ్రికి నిజమైన పుత్రోత్సాహం అంటుంటారు. కొడుకు విజయం కంటే తండ్రికి కావాల్సింది ఇంకేం ఉండదని చెబుతుంటారు. అలాంటి కొడుకు ఎన్నికల్లో గెలవగా.. పుత్రోత్సాన్ని ఆస్వాదించకుండానే.. ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ కేబినెట్ మంత్రి రాజ్ కె పురోహిత్ 70 ఏళ్ల వయసులో ఆదివారం (జనవరి 18) తెల్లవారుజామున కన్నుమూశారు. ముంబైలోని 'బాంబే ఆసుపత్రి'లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఇటీవల జరిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన కొడుకు విజయం సాధించడం గమనార్హం.


రాజ్ కె పురోహిత్ కొడుకు ఆకాశ్ రాజ్ పురోహిత్.. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 121వ వార్డు నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించాడు. ఆ మరుసటి రోజే రాజ్ కె పురోహిత్ చనిపోవడం.. ఆ కుటంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. గెలిచిన ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కాగా, ఆకాశ్ పురోహిత్ విజయాన్ని శుక్రవారం (జనవరి 16) పార్టీ కార్యకర్తలు కోలాహలంగా జరుపుకున్నారు. కానీ సీనియర్ నేత మరణంతో పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


రాజ్ కె పురోహిత్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జనవరి 15న సాయంత్రం ఆయన బాంబే ఆసుపత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. ముంబై రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన రాజ్ కె పురోహిత్‌ను గుర్తుచేసుకుంటూ.. పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం తెలిపారు. ఆదివారం ( జనవరి 18 ) మధ్యాహ్నం సోనార్ లేన్ శ్మశానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


సుదీర్ఘ రాజకీయ జీవితం..


కాగా, రాజ్ కె. పురోహిత్ ఐదుసార్లు మహారాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ముంబాదేవి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు, కొలాబా నియోజకవర్గానికి ఒకసారి ప్రాతినిధ్యం వహించారు. 25 సంవత్సరాలకు పైగా తన రాజకీయ జీవితంలో.. ముంబై సమస్యలపై బలమైన అవగాహన కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా దక్షిణ ముంబైలో బీజేపీని బలోపేతం చేయడంలో కూడా రాజ్ కె పురోహిత్ కీలక పాత్ర పోషించారు.


మంత్రిగా ఉన్న సమయంలో ముంబైలో పెరిగిన అద్దె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజ్ కె పురోహిత్ దృష్టి సారించారు. మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు ఉపశమనం కలిగించే విధానాలపై కృష్టి చేశారు. పురోహిత్ ఏది ఉన్నా బహిరంగంగా మాట్లాడతాడని, నిజాయితీపరుడని ఆయన సహచరులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa