అన్యోన్యంగా కాపురం చేస్తున్న ఆ దంపతులను విధి చిన్నచూపు చూసింది. శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వద్ద వీరు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ కారు ఢీకొనడంతో ఇద్దరూ మృతిచెందారు. శ్రీకాళహస్తి రూరల్ సీఐ కృష్ణమోహన్ కథనం మేరకు.. నెల్లూరు జిల్లా బాలాయపల్లె మండలం కోనంగిగుంటకు చెందిన లీలాకుమార్ (32) బీటెక్ పూర్తి చేసి శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కర్మాగారంలో పనిచేస్తున్నారు. కాగా, ఆయనకు స్వగ్రామానికి చెందిన రాజేశ్వరి(28)తో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కిందట రాజేశ్వరికి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వార్డు సచివాలయ మహిళా పోలీసుగా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి విధుల నిమిత్తం అక్కడే ఉంటున్న ఆమె నాలుగురోజుల కిందట సెలవుపై కోనంగిగుంటకు వచ్చారు. అనంతరం రైలులో ఆళ్లగడ్డ వెళ్లాలని బుధవారం సాయంత్రం భర్తతో కలసి ఆమె రేణిగుంట రైల్వేస్టేషన్ బయలుదేరారు. ఏర్పేడు-వెంకటగిరి రహదారిలోని ఇనగలూరు వద్దకు రాగానే, ఏర్పేడు వైపు వెళుతూ ఎదురుగా వస్తున్న ఓ కారు వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లీలాకుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్, తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తీవ్రంగా గాయపడిన రాజేశ్వరిని గుర్తించారు. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను తమ వాహనంలోనే తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మార్గమధ్యంలో మృతిచెందినట్లు పేర్కొన్నారు. భార్యాభర్తల మృతితో కోనంగిగుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వారందరూ పరారైనట్లు పోలీసులు తెలిపారు. కారు నెంబర్ ఆధారంగా వైజాగ్లోని గాజువాక ప్రాంతానికి చెందినట్లు గుర్తించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa