యాస్ తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సిఎం జగన్ పలు ఆదేశాలనిచ్చారు. సోమవారం ఉదయం అధికారులతో సిఎం వైఎస్.జగన్ సమావేశమయ్యారు. తుపాను ప్రభావిత ప్రాంతాలయిన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని సిఎం కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ... తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ముందుజాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని, ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆక్సిజన్ సిలిండర్లకు రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని ఆయా ఆస్పత్రులకు కేటాయించాలని ఆదేశించారు. తుపాను కారణంగా ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సేకరణకు ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని, తగినంత నిల్వలు పెట్టుకోవాలని సిఎం సూచించారు. ప్రత్యేక దృష్టి పెట్టి ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు తుపాను పరిణామాలను ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలని అధికారులకు సిఎం సూచించారు. అవసరమైన చోట్ల లోతట్టు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించాలని అధికారులను సిఎం ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజల తరలింపును వెంటనే ప్రారంభించాలన్నారు. సహాయ శిబిరాల్లో నిత్యావసరాల దగ్గరనుంచి అన్నిరకాల సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్ ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa