మూడంతస్తుల ప్యాలెస్.. మొత్తం 400 గదులు. అతి పెద్ద హాల్. ఆ హాల్లో అత్యంత బరువైన భారీ షాండ్లియర్లు. వాటి బురువుకు సీలింగ్ ఆగుతుందా లేదా అన్నది టెస్ట్ చేయడానికే సీలింగ్కు ఏనుగులను వేలాడదీసి మరీ చూశారట. ప్యాలెస్ హాల్ గోడలకు ఏకంగా 560 కిలోల బంగారాన్ని పోత పోశారట. ఏంటీ.. వింటేనే ఆశ్చర్యం కలుగుతోంది కదూ. అత్యంత ఖరీదైన ఆ భవనం ఎవరిదా అని ఆలోచిస్తున్నారా..? ఎవరిదో కాదు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న మాజీ కాంగ్రెస్ యువ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాది. గతేడాది ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. రాయల్ సిటీ గ్వాలియర్లో ఉండే ఈ సింధియా యువరాజు వంశపారంపర్యంగా వచ్చిన కోటలో ఉంటున్నారు. ఈ కోట పేరు 'జై విలాస్ ప్యాలెస్'. క్లాసిక్ యూరోపియన్ స్టైల్లో ఉండే ఈ భవనంలో టుస్కన్, ఇటీలియన్, కోరింథియన్ స్టైల్స్ కనిపిస్తాయి. గతంలో గ్వాలియర్ను పాలించిన హిందూ మరాఠా రాజవంశమైన సింధియాలు దీన్ని నిర్మించారు. 12 లక్షల 40 వేల 771 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది ఈ రాజభవనం.
మమారాజ జయాజీరావవు సింధియా హయాంలో 1874 సంవత్సరంలో ఈ రాజభవనం పునాది పడింది. బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్ సర్ మైకేల్ ఫిలోస్ ఈ మ్యాన్షన్ డిజైన్ చేశారు. ఈ భవనాన్ని అప్పట్లోనే కోటి రూపాయలతో నిర్మించారు. ఇప్పటి లెక్కల ప్రకారం ఈ భవనం విలువ 10 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ ప్యాలెస్లో ఒక చిన్న మోడల్ రైలు ఉంది. దీన్ని బలమైన వెండితో తయారుచేశారు. అతిథుల కోసం సిగార్లు, బ్రాందీ తీసుకురావడానికి ఈ రైలును ఉపయోగించేవారట. ఈ భవనంలో మొత్తం 400 గదులు ఉన్నాయి. వీటిలో 35 గదులను కలిపి ఒక మ్యూజియంగా మార్చారు. దీని పేరు హెచ్.హెచ్. మహారాజ జీవాజీరావు సింధియా మ్యూజియం. ఆయన జ్ఞాపకార్థం దీన్ని రాజమాత శ్రీమంత్ విజయరాజే సింధియా ఏర్పాటు చేశారు. మరాఠా సింధియా రాజవంశానికి చెందిన వెండి రధం, పల్లకీలు, వెండి బగ్గీలు, వింటేజ్ లగ్జరీ కార్లు వంటి ఆస్తులు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఝాన్సీరాణి లక్ష్మీబాయి డాలు (షీల్డ్), ఔరంగజేబు, షాజహాన్ కాలం నాటి కత్తులు ఇక్కడ కనిపిస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో తమ కళలను ప్రదర్శించాలనుకునే యువ కళాకారులకు ఇది చక్కని వేదిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa