ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగింపు నిర్ణయంపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హర్షం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 06:41 AM

గూడూరు నియోజకవర్గంతో పాటు కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని నేడు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా సోమిరెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ తాజా నిర్ణయం గూడూరు ప్రజలతో పాటు ఎమ్మెల్యే సునీల్ కుమార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలందరిలో ఆనందం నింపిందన్నారు. 2024 ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని కొనియాడారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను, వారి అభిప్రాయాలను కూటమి ప్రభుత్వం గౌరవించిందని పేర్కొన్నారు.గత వైసీపీ పాలనలో జరిగిన అస్తవ్యస్త జిల్లాల విభజనతో నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీసిటీ, షార్, పులికాట్ సరస్సు, మేనకూరు సెజ్ వంటి కీలక ప్రాంతాలతో పాటు వెంకటగిరి పోలేరమ్మ, సూళ్లూరుపేట చెంగాళమ్మ వంటి ప్రముఖ దేవస్థానాలను కూడా కోల్పోయామని గుర్తుచేశారు. ఇప్పుడు కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపడంతో రామాయపట్నం పోర్టు కూడా చేజారిపోతోందన్నారు. ఇలాంటి తరుణంలో గూడూరును, మూడు మండలాలను నెల్లూరులోనే కొనసాగించాలనే నిర్ణయం తీవ్ర నిరాశలో ఉన్న ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిందని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa