ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కరోజే రూ. 20 వేలు పెరిగిన వెండి ధర.. హైదరాబాద్‌లో కేజీ ఎంతంటే?

business |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 11:00 PM

ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దాదాపు 70 శాతానికి పెరగ్గా.. కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. అయితే అంతా బంగారం గురించి మాట్లాడుకుంటున్నారు.. వెండి ధర బంగారం కంటే ఎంతో ఎక్కువ పెరిగింది. ఇంకా పెరుగుతూ పోతూనే ఉంది. ఇప్పుడు ఒక్కరోజే రికార్డు స్థాయిలో.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే ఏకంగా రూ. 20 వేలు పెరిగింది. దేశీయంగా హైదరాబాద్ నగరంలో ఇవాళ రూ. 20 వేలు పెరిగిన వెండి ధర కిలోకు రూ. 2.74 లక్షల వద్ద ఉంది. ఇది జీవన కాల గరిష్ఠ స్థాయి ధరగా చెప్పొచ్చు. దీనికి ముందు కూడా వరుసగా రూ. 9 వేలు, రూ. 1000, రూ. 10 వేలు, రూ. 3 వేలు, రూ. 5 వేలు పెరిగింది. ఇలా 6 రోజుల్లోనే రూ. 48 వేలు పెరగ్గా.. 8 రోజుల్లో రూ. 53 వేలు పెరగడం గమనార్హం.


దీంతో ఇప్పుడు వెండి కొనడం కూడా చాలా కష్టంగా మారింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సిల్వర్ రేటు రికార్డు స్థాయిలో 170 శాతానికిపైగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అంటే బంగారం కంటే రెట్టింపు స్థాయిలో పెరిగిందని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా వెండి ధర ఒక్కరోజులోనే 10 శాతానికిపైగా పెరిగింది. స్పాట్ సిల్వర్ రేటు 10 శాతం పెరగడంతో ఇప్పుడు అది ఔన్సుకు 79.38 డాలర్ల వద్ద స్థిరపడింది. బంగారం, వెండి ధరల బాటలోనే.. పల్లాడియం, ప్లాటినమ్ ధరలు కూడా భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.


ఇక్కడ వెండి ధరలు పెరిగేందుకు చాలా అంశాలు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను ఇప్పటికే తగ్గించడం సహా.. భవిష్యత్తులోనూ తగ్గించనున్నట్లు సంకేతాలు ఇవ్వగా.. బంగారం, వెండి వంటి లోహాలకు డిమాండ్ పెరిగి.. ఇవి పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతున్నాయి. దీంతో ధర అమాంతం పెరుగుతోంది.


ఇంకా సిల్వర్‌కు పారిశ్రామికంగా మస్తు డిమాండ్‌ ఉండటం.. అదే సమయంలో గిరాకీకి తగినట్లుగా సప్లై లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు దారితీస్తోంది. సోలార్ ప్యానెల్స్ తయారీలో, ఎలక్ట్రిక్ వాహనాలు, 5G టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ల తయారీలో, ఏఐ డేటా సెంటర్లలో, సెమీ కండక్టర్లు వంటి రంగాల్లో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో వెండి ధర పెరుగుతూనే ఉంది.


>> ఎంసీఎక్స్ ఫ్యూచర్స్‌లోనూ వెండి ధర 80 డాలర్లకు చేరువకాగా.. సమీప భవిష్యత్తులో 100 డాలర్ల మార్కును కూడా దాటుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఇంకా తగ్గిన నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్ల కోత విధిస్తుందన్న సంకేతాలు వెండి ధర ఇంకా పెరిగేందుకు కారణం అవుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతుండటంతో.. సురక్షిత పెట్టుబడి సాధనాలుగా బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతూనే ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa