హాస్టల్ గదిలో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని బికనీర్ జిల్లా కోట్ పుట్లీ ప్రాంతానికి చెందిన ముఖేష్ అనే కారు డ్రైవర్ కు ఆయుష్(22) అనే కూతురు ఉంది. ఆమె సర్దార్ పటేల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నర్సింగ్ ఫైనలియర్ చదువుతోంది. హాస్టల్ లో ఉంటున్న ఆమెకు అదే కాలేజీలో చదువుతున్న చందా ప్రజాపత్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ద్వేషంగా మారింది. వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ 7 నెలలుగా వారు గొడవ పడుతూనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వాళ్లిద్దరి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారిద్దరి తీరు మారకపోవడంతో హాస్టల్లోని ఒకే గదిలో వారిద్దరిని ఉంచారు. అలా ఉంటే మారుతారని భావించారు. రాత్రిపూట చందా ప్రజాపత్ కు చదివే అలవాటు ఉంది. ఆయుష్ కు మాత్రం ఉదయం చదివే అలవాటు ఉంది. దీంతో ఇద్దరి మధ్య లైట్స్ విషయంలో గొడవలు మొదలయ్యాయి. రాత్రంతా లైటింగ్ వెలుతురులో పడుకోవడం వల్ల ఆయుష్కు మైగ్రేన్ సమస్య తలెత్తింది. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. గదిలో చందా ప్రజాపత్ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం, తోటి విద్యార్థులు షాక్ అయ్యారు. తన కూతురు చావుకు కారణం ప్రజాపత్ అంటూ ఆయుష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నామని, ఆయుష్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చందా ప్రజాపత్ కు, మరో విద్యార్థిని నహర్ సింగ్ కు వీడియో కాల్ చేసిందని పోలీసులు తెలిపారు. ఇదంతా ఆమె కాల్ రికార్డ్స్ ద్వారా తెలిసిందన్నారు. వారితో ఏం మాట్లాడిందనే విషయాన్ని కనుక్కుంటున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa