చిన్నారులకు టీకా అందించేందుకు ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. వీటిలో భాగంగా అనేక చర్యలు తీసుకోనున్నది. కొత్త వేరియంట్ల ఆందోళన నేపథ్యంలో 15 ఏళ్లు దాటిన పిల్లలకు టీకాకు కేంద్రం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. పిల్లలకు టీకా కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నట్టు తెలిపింది. కొ-విన్ యాప్ ద్వారా జనవరి 1 నుంచి 15-18 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. కొ-విన్ యాప్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మాట్లాడుతూ.. కొంతమందికి ఆధార్ కార్డ్లు లేకపోవచ్చు కాబట్టి విద్యార్థులు తమ ఐడీ కార్డ్ల సాయంతో నమోదు చేసుకోవడానికి COWIN పోర్టల్లో మార్పులు చేశామని తెలిపారు.
రెండు రోజుల కిందట జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. జనవరి 3 చి 15-18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకాలు ఇవ్వడమనే ప్రయత్నం ద్వారా పాఠశాలల్లో బోధన సాధారణ స్థితికి వస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, ఒమిక్రాన్ వల్ల భయం లేకపోయినా అప్రమత్తత అవసరమన్న మోదీ.. 60 ఏళ్ల వయసు దాటి, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్యుల సలహాపై ‘ప్రికాషన్ డోసు’ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్లైన్ వర్కర్లకు జనవరి 10 నుంచి టీకాలు వేస్తామన్నారు. ఇదిలావుంటే ప్రికాషన్ డోస్ గురించి కూడా డాక్టర్ శర్మ కీలక విషయాలను వెల్లడించారు. ‘టీకా ప్రక్రియ సరిగ్గా అదే విధంగా ఉంటుంది.. 60 ఏళ్లు కంటే ఎక్కువ వయసున్నవారు రెండు డోస్లు తీసుకుని.. చివరి డోస్ నమోదు చేసుకున్న రోజు మధ్య గ్యాప్ 9 నెలల కంటే ఎక్కువ (39 వారాలు) ఉన్నవారు అర్హులు.. పేరు నమోదు చేసుకున్నప్పుడు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేదా అని అడుగుతుంది.. అవును అనే ఆప్షన్ ఎంచుకుంటే వ్యాక్సినేషన్ కేంద్రంలో రిజిస్టర్డ్ డాక్టర్ నుంచి సర్టిఫికేట్ను బుక్ చేసుకోవాలి.. ఆపై టీకా తీసుకోవచ్చు’ అన్నారు.
ఇదిలావుంటే ఈ ఏడాది జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 141 కోట్ల డోసుల్ని పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. దేశ జనాభాలో 61శాతం మందికి పూర్తిస్థాయి టీకాలు.. 90 శాతానికిపైగా ఒక డోసు తీసుకున్నట్టు పేర్కొంది. కాగా, కరోనా మహమ్మారిపై పోరులో ఆరోగ్య సిబ్బంది తమ సమయాన్ని కరోనా బాధితుల సేవకే వినియోగిస్తున్నారని ప్రధాని కొనియాడారు. వారికి మరో డోసు టీకా ఇవ్వడం ద్వారా ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు. దేశంలో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ బెడ్స్ ఉన్నట్టు తెలిపారు. చిన్నారుల కోసం ఐసీయూతో కలిసి 90 వేల పడకలు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన వద్ద ఆర్థిక కార్యకలాపాలు ప్రోత్సహకరంగానే ఉన్నాయన్న మోదీ.. వదంతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అప్రమత్తంగా ఉండడం వల్లే జీవనాన్ని తిరిగి సాధారణస్థాయికి తీసుకురాగలిగామని ప్రధాని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa