పోలీసుల నిర్లక్ష్య వైఖరితోనే మందా సాల్మన్ హత్య జరిగిందని, సీఎం చంద్రబాబు కుట్రతోనే పక్కా పథకం ప్రకారం సాల్మన్ని అతి దారుణంగా పట్టపగలు ఇనుప రాడ్లతో కొట్టి చంపారని వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు మందా సాల్మన్ దారుణ హత్య నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి ఆయన కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో దిగజారిపోతున్న శాంతిభద్రతలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులపై డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మందా సాల్మన్ ది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యేనని, దీన్ని సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సాల్మన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతోపాటు కోటి రూపాయల పరిహారం, ఐదెకరాల పొలం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు ఈ హత్య ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు నిత్యకృత్యమై పోయాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నిర్వీర్యం అయ్యాయని చెప్పడానికి మందా సాల్మన్ హత్యే తాజా నిదర్శనమని నాయకులు వివరించారు. కళ్ల ముందు దారుణాలు జరుగుతున్నా చోద్యం చూస్తున్న పోలీసులు రాబోయే వైయస్ఆర్సీపీప్రభుత్వంలో మూల్యం చెల్లించుకోకతప్పదని వారు హెచ్చరించారు. డీజీపీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో డీజీపీ కార్యాలయం గేటు వద్దనే బైఠాయించి ధర్నా చేశారు. దీంతో దిగివచ్చిన పోలీసులు వారిని లోపలికి అనుమతించి ఏడీజీకి వినతిపత్రం ఇప్పించి పంపించారు. ముందస్తు సమాచారం ఉన్నా తమను కలవకపోవడంతో ప్రజా సమస్యలను వినడానికి కూడా డీజీపీకి ఓపిక లేదా అని వైయస్ఆర్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయస్థానాలను, ఎన్హెచ్చార్సీసీని, నేషనల్ ఎస్సీ కమిషన్ని ఆశ్రయిస్తామని, వారి కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైయస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa