కూటమి పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్ధులు సహా అన్ని వర్గాల ప్రజల్లోనూ సంక్రాంతి సందడి లేకుండా పోయిందని.. పండగ పూట కూడా రాష్ట్ర ప్రజలకు నిరుత్సాహమే మిగిలిందని శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... పండగ ముందే మద్యం ధరలు పెంచిన చంద్రబాబు, భూములు విలువను పెంచుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడాన్ని తప్పుబట్టారు. మరోవైపు చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని... మునుపెన్నడూ లేని విధంగా వందలాది కుటుంబాల గ్రామబహిష్కరణే దీనికి నిదర్శమని తేల్చి చెప్పారు. వైయస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్న ఆయన దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమి పాలనలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, గ్రామాల్లో రైతులకు నేటికీ యూరియా అందుబాటులో లేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. విద్యార్ధులకూ బాబు పాలనలో న్యాయం జరగడం లేదని.. 18 నెలలుగా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా.. 8 త్రైమాసికాలుగా రూ.5,600 కోట్ల బకాయిలు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. వైయస్ఆర్సీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలకే కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేస్తుందని తేల్చి చెప్పిన బొత్స సత్యనారాయణ గ్రీన్ కో ప్రాజెక్టు అందులో భాగమేనని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa